ముగ్గురు టాప్ స్టాక్​బ్రోకర్లపై నజర్​!

ముగ్గురు టాప్ స్టాక్​బ్రోకర్లపై నజర్​!
  • మనీలాండరింగ్​ ఆరోపణలు రావడం వల్లే

న్యూఢిల్లీ: దేశంలోని ముగ్గురు టాప్​ స్టాక్​ బ్రోకర్లపై వివిధ రెగ్యులేటరీ ఏజన్సీల దర్యాప్తు కొనసాగుతోంది. వేల కోట్ల రూపాయల మనీలాండరింగ్​ ట్రాన్సాక్షన్లతోపాటు, ఫ్రాడ్యులెంట్​ ట్రేడింగ్​ యాక్టివిటీస్​కు పాల్పడ్డారనే ఆరోపణలు ఈ ముగ్గురు టాప్​ బ్రోకర్లు ఎదుర్కొంటున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ టాప్​ బ్రోకింగ్​ కంపెనీల పేర్లను ఇప్పుడే బయటపెట్టలేమని సీనియర్​ ప్రభుత్వ ఆఫీసర్లు చెప్పారు. ఈ బ్రోకింగ్​ కంపెనీలు దేశంలోని కొంత మంది రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు వారు వెల్లడించారు. ఒక సీనియర్​ రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యుడి పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గురు టాప్​ బ్రోకర్లపైనా గత 4–5 ఏళ్లుగా వివిధ దర్యాప్తు ఏజన్సీల ఇన్వెస్టిగేషన్​ కొనసాగుతోందని ఆ ఆఫీసర్లు చెప్పారు. ఈ టాప్​ బ్రోకర్లు క్యాపిటల్​ మార్కెట్లలోని వివిధ సెగ్మెంట్లలో ఆపరేట్​ చేస్తున్నట్లు వివరించారు. బ్రోకరేజ్​, ఇన్వెస్ట్​మెంట్​ ఎడ్వైజరీ సర్వీసులు, పోర్ట్​ఫోలియో మేనేజ్​మెంట్​, ఎసెట్​ మేనేజ్​మెంట్​ ఫండ్​, నాన్​బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​ వంటి సెగ్మెంట్లలో కార్యకలాపాలను ఆ బ్రోకింగ్​ కంపెనీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. 

రంగంలోకి దిగనున్న సీబీఐ....

సెబీ, ఆర్​బీఐ, ఈడీలు ఈ టాప్​ 3 స్టాక్​ బ్రోకర్లపై ఇన్వెస్టిగేషన్​ జరుపుతున్నాయని వెల్లడించారు. కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని గుర్తించడంతో ఇప్పుడు సీబీఐని కూడా రంగంలోకి దించాలని భావిస్తున్నారు. మనీలాండరింగ్​ యాక్టివిటీస్​ను దాచిపెట్టేందుకు కాంప్లెక్స్​ ఫైనాన్షియల్​ మార్కెట్​ ట్రాన్సాక్షన్లను ఆ బ్రోకింగ్​ కంపెనీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఫైనాన్షియల్​, బ్యాంకింగ్​ ట్రాన్సాక్షన్లతోపాటు, ఫండ్స్​ ఎక్కడి నుంచి ఎక్కడికి , ఎలా ప్రయాణించాయనే అంశంపైనా, విదేశాలకు (ట్యాక్స్​హావెన్స్​) తరలించడంపైనా, అలాగే ఆయా బ్రోకర్లకు సంబంధించిన కాల్​డేటా రికార్డులు, సోషల్​ మీడియా సంభాషణలను సైతం దర్యాప్తు ఏజెన్సీలు విశ్లేషిస్తున్నాయని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అవసరమైన సాయం కోసం విదేశీ ప్రభుత్వాలకు కూడా రిక్వెస్టులు పంపినట్లు పేర్కొన్నారు.

కొన్ని వేల కోట్ల రూపాయల మేర డబ్బు ట్రాన్స్​ఫర్​ అయినట్లు వారు చెబుతున్నారు. స్విట్జర్లాండ్​ వంటి కొన్ని దేశాలు తమ రిక్వెస్ట్​లకు బదులిచ్చాయని వివరించారు. దర్యాప్తు ఏజన్సీలకు సమాచారం ఇవ్వడానికి ముందు తమ క్లయింట్లకు ఒక అవకాశాన్ని సాధారణంగా కొన్ని దేశాలలోని చట్టాల ప్రకారం బ్యాంకులు, ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్లు ఇస్తాయని, ఇప్పుడు ఆ ప్రాసెస్​ కొనసాగుతోందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. స్పాట్​ కమోడిటీ ఎక్స్చేంజ్​ కేసులో మొదటిసారిగా ఈ టాప్​ 3 బ్రోకర్ల పాత్ర వెలుగులోకి వచ్చిందని, ఆ తర్వాత మనీలాండరింగ్​ ట్రాన్సాక్షన్లలో సైతం వాటికి భాగం ఉన్నట్లు దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయని వారు పేర్కొన్నారు. మనీలాండరింగ్​ జరిగిందనే అనుమానాన్ని సెబీ ముందుగా వ్యక్తం చేసిందని, దాంతో ఇతర దర్యాప్తు ఏజెన్సీలు సైతం ఇన్వెస్టిగేషన్​కు దిగాయని ఆ అధికారులు వెల్లడించారు. బ్రోకర్ల పేర్లు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ అధికారులు వారికి సంబంధించిన కొన్ని వివరాలు మాత్రం చెప్పారు. ఆన్​లైన్​ బ్రోకింగ్​ కంపెనీలు రావడానికి ముందు  2, 3 ఏళ్ల కిందటి దాకా ఆ బ్రోకర్లే  దేశంలో టాప్​ ప్లేయర్లని వివరించారు.