ఎమర్జెన్సీ యూజ్‌‌‌‌‌‌‌‌కు 3 వ్యాక్సిన్లు రెడీ

ఎమర్జెన్సీ యూజ్‌‌‌‌‌‌‌‌కు 3 వ్యాక్సిన్లు రెడీ

నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఫైజర్, భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్ లు తయారు చేస్తున్న మూడు వ్యాక్సిన్ లు ఎమర్జెన్సీ వాడకానికి సిద్ధంగా ఉన్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. ఫిక్కీ 93వ యాన్యువల్ కన్వెన్షన్ లో ఆయన కరోనా వ్యాక్సిన్ డెవలప్ మెంట్ అంశంపై మాట్లాడారు. వ్యాక్సిన్ సురక్షితమేనా? ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా? అన్న విషయాలన్నింటినీ అనలైజ్ చేసిన తర్వాతే డీసీజీఐ ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇస్తుందని తెలిపారు. వీటిపై మరికొద్ది రోజుల్లోనే డీసీజీఐ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే తాము డీసీజీఐపై ప్రెజర్ పెట్టబోమని, ఆ సంస్థ తనంతట తానుగా సేఫ్టీ, ఎఫికసీ, సైన్స్, ఎవిడెన్స్, రూల్స్ ప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. బ్రిటన్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీతో కూడా డీసీజీఐ టచ్ లో ఉందని వీకే పాల్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలు, ఎన్నికల నిర్వహణకు తగిన వ్యవస్థలు, సిబ్బంది ఉన్నందున.. కరోనా వ్యాక్సిన్ పంపిణీని కూడా విజయవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందన్నారు.

జనవరి నుంచే వ్యాక్సిన్!: అదర్ పూనావాలా

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ల పంపిణీ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా చెప్పారు. 2021 అక్టోబర్ కల్లా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావచ్చని ఆయన వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి ఈ నెల చివరినాటికి  ఆమోదం లభించవచ్చని చెప్పారు. శనివారం ‘ఎకానమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్’లో అదర్ పూనావాలా మాట్లాడారు. వచ్చే ఏడాది అక్టోబర్ తర్వాత పరిస్థితి మునుపటిలా మళ్లీ నార్మల్ అవుతుందన్నారు. ‘‘ఈ నెల చివరినాటికి కరోనా వ్యాక్సిన్ కు ఎమర్జెన్సీ లైసెన్స్ వచ్చే చాన్స్ ఉంది. పూర్తి స్థాయి లైసెన్స్ మాత్రం కొంచెం లేట్ కావచ్చు. ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి వస్తే.. వ్యాక్సినేషన్ ను 2021 జనవరి నుంచే ప్రారంభించేందుకు అవకాశం ఉంది” అని ఆయన వివరించారు.

జులై నాటికి 40 కోట్ల డోసులు సిద్ధం..

దేశవ్యాప్తంగా 20 శాతం మందికి వ్యాక్సిన్ వేసిన తర్వాత.. కరోనా నిర్మూలనపై నమ్మకం కలుగుతుందని అదర్ పూనావాలా చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేందుకు అవసరమైనన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. 2021 జులై నాటికి 30 కోట్ల నుంచి 40 కోట్ల డోసుల వరకు అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ మార్కెట్లకు అవసరమైనన్ని వ్యాక్సిన్ లను తయారు చేసేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలు డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్ ను మన దేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ‘కొవిషీల్డ్’ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.