దేశంలో కరోనా కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో కలిసి కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్. గతంలో భారత్ లో పోలియో కంట్రోల్ కోసం సహకరించిన డబ్ల్యూహెచ్ఓ సర్వైలెన్స్ టీమ్స్ ను ప్రస్తుత అవసరాలకు ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు. కరోనా పరిస్థితిపై రోజువారీ ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన ఈ వివరాలు తెలిపారు. దేశంలో కరోనా కంటైన్మెంట్ జోన్లలో వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యపై నిన్న డబ్ల్యూహెచ్ఓ ఫీల్డ్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు చెప్పారు.
దేశంలో ఇప్పటి వరకు 325 జిల్లాల్లో కరోనా కేసులు ఒక్కటి కూడా లేవని చెప్పారు లవ్ అగర్వాల్. అలాగే గత 28 రోజులగా పుదుచ్చేరిలోని మహె జిల్లాలో కొత్తగా కేసులు రాలేదని తెలిపారు. అలాగే మరో 27 జిల్లాల్లో గడిచిన 14 రోజులుగా కరోనా కేసులు నమోదు కాలేదని చెప్పారాయన.