న్యూఢిల్లీ: సంప్రదాయ ఇంధన వనరుల నుంచి తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేసే ఇంధన వనరులకు మళ్లేందుకు(ఎనర్జీ ట్రాన్సిషన్) కేంద్రం రూ.35 వేల కోట్లు కేటాయించింది. 2030 లోపు 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ నెలకొల్పుతామన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం కింద గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాంను త్వరలోనే నోటిఫై చేస్తామన్నారు.
‘‘దేశాన్ని ఎనర్జీ ఇండిపెండెంట్ నేషన్ గా చేసేందుకు, కీలక రంగాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు గత నెల 4న నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను మోడీ సర్కారు ఆమోదించింది. ఇందుకు ప్రారంభంలో రూ.19,744 కోట్ల ఔట్ లేను కేటాయించాం. గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్, ఉత్పత్తి, వాడకం, ఎగుమతిని పెంచడం ఈ మిషన్ ఉద్దేశం. అంతేకాకుండా 2030 లోపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులను ఈ మిషన్ ద్వారా సమీకరిస్తాం” అని నిర్మల చెప్పారు. అలాగే, 2070 లోపు జీరో కార్బన్ ఎమిషన్ ను సాధించాలని మోడీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని ఆమె వెల్లడించారు.