- 49.18 లక్షల ఉద్యోగులు, 67.95 లక్షల పెన్షనర్లకు లబ్ధి
- కేబినెట్ కమిటీ భేటీలో నిర్ణయం
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏను (కరువు భత్యం) 4 శాతం పెంచింది. దీంతో బేసిక్ పేలో ప్రస్తుతం ఉన్న 46 శాతం నుంచి 50 శాతానికి డీఏ పెరిగింది. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన యూనియన్ కేబినెట్ గురువారం సమావేశమైంది.
కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మా0ట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న 46 బేసిక్ పేలో డీఏ, డియర్ నెస్ రిలీఫ్ను 4 శాతం పెంచి 50 శాతానికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో ఖజానాపై ఏటా రూ.12,869 కోట్ల భారం పడనుందని చెప్పారు. 2024 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం రూ.15,014 కోట్ల భారం పడుతుందని గోయల్ పేర్కొన్నారు.
కాగా, డీఏలో పెంపుతో టీఏ, క్యాంటీన్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్ కూడా 25 శాతం పెరిగాయి. బేసిక్ పేలో హౌస్ రెంట్ అలవెన్స్ 27, 19, 9 శాతం నుంచి వరుసగా 30, 20, 10 శాతానికి పెరిగింది. అలాగే గ్రాట్యుటీ బెనిఫిట్స్ కూడా 25 శాతం పెరిగింది. గ్రాట్యుటీని ప్రస్తుతం ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. వివిధ భత్యాల్లో పెంపుతో ఖజానాపై ఏటా రూ.9400 కోట్ల భారం పడనుంది. కాగా, ఏడో సెంట్రల్ పే కమిషన్ సిఫారసుల మేరకు డీఏ, డీఆర్ పెంచారు.
ముడి జనపనారకు ఎంఎస్పీ రూ.285 పెంపు
ముడి జనపనారకు కనీస మద్దతు ధరను కేంద్రం రూ.285 పెంచింది. దీంతో 2024–25 సీజన్ లో క్వింటాల్ జనపనార ధర రూ.5,335కు చేరింది. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తూర్పు రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో రైతులకు లబ్ధి కలగనుందని పీయూష్ గోయల్ తెలిపారు. 2023–24 సీజన్ లో రైతులకు కేంద్రం రూ.524.
ఉజ్వల లబ్ధిదారులకు సబ్సిడీ పొడిగింపు
ఉజ్వల యోజన పథకం కింద పేద మహిళలకు ప్రతి సిలిండర్ కు రూ.300 సబ్సిడీని కేంద్రం మరో ఏడాది పొడిగించింది. 2025 మార్చి 31 వరకు ఇది వర్తిస్తుంది.
ఇండియా ఏఐ మిషన్కు ఆమోదం
రూ.10,372 కోట్లతో ఇండియా ఏఐ మిషన్ ను ఐదేండ్ల పాటు అమలు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధులతో వచ్చే ఐదేండ్ల పాటు కంప్యూటింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను తయారు చేస్తారు. ఏఐ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయడానికి వివిధ కంపెనీలకు పదివేల జీపీయూ గల సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీని అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.