
శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు సంబంధించి స్పెక్ట్రమ్ ధరలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సిఫారసులను ప్రకటించింది. ఎలాన్ మస్క్ తో సహా ఇండియాలో శాటిలైట్ సేవలు అందించాలనుకుంటే ట్రాయ్ నిబంధనలు పాటించాల్సిందేనని పేర్కొంది. శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు ఆపరేటర్లు చెల్లించాల్సిన ఛార్జీలను ప్రకటించింది.
ఇండియాలో ఇంటర్నెట్ సర్వీసెస్ అందించేందుకు ఎలోన్ మస్క్ స్టార్లింక్తో సహా ఆపరేటర్లు ఆదాయంలో 4 శాతం లెవీ చెల్లించాలని ట్రాయ్ సూచించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో సేవలను అందించే వారు ప్రతి చందాదారునిపై ఏటా అదనంగా రూ. 500 చెల్లించాలని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు అదనపు ఛార్జీ ఉండదు.
శాటిలైట్ (ఉపగ్రహ) బ్రాడ్బ్యాండ్ కోసం స్పెక్ట్రమ్ను ఐదు సంవత్సరాలకు కేటాయించాలని, ఒకవేళ కొనసాగించాల్సి వస్తే మరో రెండేళ్లు పొడిగించవచ్చునని ప్రతిపాదించింది. రెవెన్యూ ఆధారంగా 4 శాతం ఛార్జ్, జియోస్టేషనరీ ఆర్బిట్ (GSO) , నాన్-జియోస్టేషనరీ ఆర్బిట్ (NGSO) ఆపరేటర్లకు ఇద్దరికీ వర్తిస్తుందని తెలిపింది. సంవత్సరానికి కనీస స్పెక్ట్రమ్ ఫీజుMHzకి రూ. 3,500 గా ప్రతిపాదించింది.
టెలికాం మౌలిక సదుపాయాలు లేని వెనుకబడిన ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరచడంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని TRAI చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి ఈ సందర్భంగా తెలిపారు. విపత్తు నిర్వహణ, సహాయ కార్యకలాపాలకు కూడా ఇవి చాలా అవసరమని ఆయన అన్నారు.
ఇండియాలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్లింక్ ఈ వారం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) అందుకుంది. కార్యకలాపాలను ప్రారంభించే ముందు లైసెన్స్ పొందాలి. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఏరోస్పేస్ సంస్థ స్పేస్ఎక్స్, ఇండియాలో స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.
అందుకోసం కీలక పోటీదారులు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జియో, ఎయిర్ టెల్ కంపెనీలు తమ నెట్వర్క్ల ద్వారా స్టార్లింక్ పరికరాలను పంపిణీ చేయడమే కాకుండా కస్టమర్ సెటప్, యాక్టివేషన్కు చేస్తాయి.