గ్రామాల్లో బాల్క సుమన్​ తిరగలే.. సమస్యలు పట్టించుకోలే : వివేక్​ వెంకటస్వామి

గ్రామాల్లో బాల్క సుమన్​ తిరగలే.. సమస్యలు పట్టించుకోలే :  వివేక్​ వెంకటస్వామి
  • కార్మికుల సొంతింటి కోసం రూ.15 లక్షల వడ్డీ లేని లోన్​
  • కాంగ్రెస్​ను గెలిపిస్తే చెన్నూర్​ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తం
  • 100 పడకల సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ ఏర్పాటు చేస్తం
  • మెడికల్ కేసులను నేరుగా హైదరాబాద్​కు రెఫర్​ చేస్తం


కాంగ్రెస్​ను గెలిపిస్తే సింగరేణిలో అనుబంధ పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆ పార్టీ చెన్నూర్​ అభ్యర్థి వివేక్​ వెంకటస్వామి అన్నారు. చెన్నూర్​లో మైనింగ్​ ఇన్​స్టిట్యూట్, మూడు స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్లు, సిరామిక్​ టైల్స్​ ఇండస్ట్రీ, అగ్రికల్చర్​ మినీ యూనివర్సిటీ, అగ్రి రీసెర్చ్​ సెంటర్ల ద్వారా 40 వేల జాబ్స్​కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ‘‘కాంగ్రెస్​ను గెలిపిస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తం. రూ.15 లక్షల వడ్డీ లేని లోన్​ ఇప్పిస్తం. మందమర్రి, రామకృష్ణాపూర్​ ఏరియాలో 100 బెడ్స్​ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ ఏర్పాటు చేస్తం. సింగరేణి నుంచి మెడికల్​ రెఫరల్​ కేసులు నేరుగా హైదరాబాద్​ వెళ్లడానికి చర్యలు తీసుకుంటం” అని ఆయన తెలిపారు. 

శుక్రవారం వివేక్​ మీడియాతో మాట్లాడుతూ.. బాల్క సుమన్​ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉండి చెన్నూర్​ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. ‘‘బాల్క సుమన్  ఎన్నడూ గ్రామాల్లో తిరగలే. ప్రజల సమస్యలు పట్టించుకోలే. ఆయనకు ఇసుక లారీలు లెక్క పెట్టుకోవడమే సరిపోయింది” అని విమర్శించారు. ఇప్పటి వరకు సుమన్ ను చూడలేదని చాలామంది చెన్నూర్​ ప్రజలు తనతో చెప్పారని అన్నారు. ‘‘నేను మాత్రం అధికారంలో ఉన్నా లేకున్నా వారానికి రెండు రోజులు పర్యటించిన. విశాక చారిటబుల్​ ట్రస్ట్, కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన” అని ఆయన వివరించారు. ఏ ఊరికి వెళ్లినా బాల్క సుమన్​ తాగునీళ్లు కూడా ఇవ్వలేదని ప్రజలు నీళ్ల సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. 

తాను ఎంపీగా ఉన్నప్పుడు రూ.14 కోట్లతో చెన్నూర్ లో మంచి నీటి సరఫరా పథకం తెచ్చానని చెప్పారు. మందమర్రి, రామకృష్ణాపూర్​లో కూడా కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధే ఇప్పటికీ కనిపిస్తున్నదని అన్నారు. తన హయాంలో రూ.38 కోట్లతో శాంక్షన్​ చేసిన క్యాతన్​పల్లి ఆర్వోబీని పదేండ్లయినా సుమన్​ పూర్తి చేయలేదని,  కేవలం సెంట్రల్​ లైటింగ్​ ఏర్పాటు చేసి రూ.వేల కోట్లతో డెవలప్​మెంట్​ చేసినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు.  ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల వైపే ఉన్నారని, అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్ని కార్యాచరణలో పెడుతామని, చెన్నూర్​ను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.

బీజేపీ, బీఆర్​ఎస్​ వల్లే సింగరేణి ప్రైవేటీకరణ: జనక్​ప్రసాద్​

బీజేపీ, బీఆర్​ఎస్​లే సింగరేణి ప్రైవేటీకరణకు కారణమని ఐఎన్​టీయూసీ సెక్రటరీ జనరల్​ జనక్​ప్రసాద్​ అన్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వం కోల్​మైన్స్​ వేలం బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. ఆ బిల్లుకు బీఆర్​ఎస్​ ఎంపీలు 13 మంది ఆమోదం తెలిపారన్నారు. వారిలో బాల్క సుమన్​, కవిత కూడా ఉన్నారని చెప్పారు వాళ్లే ఇప్పుడు కాంగ్రెస్ ను బద్నామ్​ చేస్తున్నారని ఆయన అన్నారు. సింగరేణి బకాయిలు రూ.30వేల కోట్లను కేసీఆర్  స్వలాభం కోసం వాడుకున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారసత్వ నియామకాలు వచ్చాయని, ఇందులో కేసీఆర్​ చేసిందేమీ లేదని అన్నారు. ప్రెస్​మీట్​లో పీసీసీ జనరల్​ సెక్రటరీ పల్లె రఘునాథ్​రెడ్డి, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్​ పాల్గొన్నారు.