
మాస్కో: రష్యాను ఉక్రెయిన్ ఊహించని దెబ్బ కొట్టింది. ఆదివారం (జూన్ 1) రష్యాలోని ఐదు ఎయిర్బేస్లపై డ్రోన్లతో మెరుపు దాడులు చేసింది. ఉక్రెయిన్ డ్రోన్ ఎటాక్లో రష్యాకు చెందిన 41 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసం అయ్యాయి. ఉక్రెయిన్ దాడులను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్, ఇవనోవో, రియాజాన్, అముర్ ప్రాంతాలలోని రష్యన్ సైనిక వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందని వెల్లడించింది. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్లలో దాడులను మినహాయించి.. మిగిలిన అన్ని ప్రాంతాలలో దాడులను రష్యా అడ్డుకున్నట్లు తెలిపింది.
ALSO READ | రష్యాపై ఉక్రెయిన్ మెరుపు దాడులు.. డ్రోన్ ఎటాక్లో 40 రష్యన్ విమానాలు ధ్వంసం
ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్ ప్రాంతాలలో వైమానిక స్థావరాలకు దగ్గరి నుంచి ఎఫ్పీవై డ్రోన్లను ప్రయోగించడం వలన అనేక విమానాలు మంటల్లో చిక్కుకున్నాయని వెల్లడించారు. మంటలను అదుపులో చేశామని.. దాడిలో పాల్గొన్న కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దీర్ఘ-శ్రేణి క్షిపణులను ప్రయోగించడానికి రష్యా ఉపయోగించే Tu-95 విమానాలతో పాటు Tu-22 వ్యూహాత్మక బాంబర్లను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడినట్లు పలు అంతర్జాతీయ వార్త సంస్థలు నివేదించాయి.
కాగా, దాదాపు మూడేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఓ వైపు ఇరు దేశాలు కాల్పుల విరమణకు చర్చలు జరుపుకుంటునే.. మరోవైపు భీకరంగా దాడులు చేసుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడి నుంచి తేరుకున్న ఉక్రెయిన్ రష్యాపై ప్రతిదాడులకు పూనుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం (జూన్ 1) వ్యూహాత్మకంగా డ్రోన్లతో మెరుపు దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఉక్రెయిన్ కొట్టిన ఊహించని దెబ్బ రష్యాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాకు ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరగడం ఇదే తొలిసారి.