
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 6,886 ఇండ్లు శాంక్షన్
- వీటిలో పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నవి 488
- వారంలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజన్నసిరిసిల్ల జిల్లాకు 6,886 డబుల్ ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 488 ఇండ్లు పూర్తికాగా అప్పట్లో పంపిణీ చేయలేదు. వీటిని కేటాయించేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపడుతున్నారు. వారం రోజుల్లో అర్హులను గుర్తించి పంపిణీ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.
488 ఇండ్లు పంపిణీకి రెడీ
జిల్లాకు మొత్తం 6,886 ఇండ్లు మంజూరు అయ్యాయి. వీటిలో సిరిసిల్ల నియోజకవర్గానికి 4,429 ఇండ్లు, వేములవాడ నియోజకవర్గానికి 2,052 ఇండ్లు, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంటకు 340, చొప్పదండి నియోజకవర్గం బోయినిపల్లికి 65 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో ప్రస్తుతం సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 266 ఇండ్లు, ముస్తాబాద్ మండలంలో 93, తంగళ్లపల్లి 27, గంభీరావుపేట 38, ఇల్లంతకుంట మండల పరిధిలో 64 ఇండ్లు పూర్తి కాగా వీటిని పంపిణీ చేసేందుకు లబ్ధిదారుల ఎంపికకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గంలో 2,052 ఇండ్లు మంజూరు కాగా ఇందులో కేవలం 224 ఇండ్లు మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు. ఇందులో 80 పూర్తి కాగా వీటిని ఇప్పటికే పంపిణీ చేశారు. ఇంకా 144 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి.
డబుల్ ఇండ్లకు లిస్ట్ రెడీ చేస్తున్నాం
డబుల్ ఇండ్ల పంపిణీకి లిస్ట్ రెడీ చేస్తున్నాం. అర్హులైన నిరుపేదలనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాం. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వారంలో ఇండ్ల పంపిణీని పూర్తి చేస్తాం.
సందీప్ కుమార్ ఝా, రాజన్నసిరిసిల్ల కలెక్టర్