రూ. ఐదు కోట్ల విలువైన ‘రేగులకుంట’ జాగాకు ఎసరు.. బై నంబర్లు వేసి ఇంటి స్థలంగా మార్పు

రూ. ఐదు కోట్ల విలువైన ‘రేగులకుంట’ జాగాకు ఎసరు.. బై నంబర్లు వేసి ఇంటి స్థలంగా మార్పు
  • ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేషన్..
  • అనుమతులు జారీ చేసిన బల్దియా  
  • తమ లేఅవుట్​లో అసలు బై నంబర్లే లేవంటున్న కాలనీ అసొసియేషన్​

చందానగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణకు గురి కాకుండా హైడ్రాను తీసుకువచ్చి యాక్షన్​తీసుకుంటుంటే.. మరోవైపు కొంతమంది అధికారుల అండదండలతో చెరువు స్థలాలను కబ్జా చేస్తున్నారు. ముఖ్యంగా కోట్లలో ధర పలికే హైటెక్​సిటీకి సమీపంలోని చెరువులను చెరబడుతున్నారు. 

ఈ క్రమంలో శేరిలింగంపల్లి మండలం హఫీజ్​పేట పరిధిలోని రేగులకుంట చెరువు స్థలాన్ని కొందరు పక్కనే ఉన్న దీప్తిశ్రీనగర్​ కాలనీకి చెందిన ప్లాట్​నెంబర్లకు బై నెంబర్లు వేసి కొట్టేశారు. వీరికి అండగా ఈ స్థలం చెరువుది కాదని ఇరిగేషన్​ఎన్​ఓసీ ఇవ్వగా, జీహెచ్ఎంసీ టౌన్​ప్లానింగ్​అధికారులు నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ స్థలంలో ఇంటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  

బై నంబర్లు వేసి బాజాప్తా కబ్జా..

హఫీజ్​పేట్ పరిధి చందానగర్​లోని దీప్తీశ్రీనగర్​కాలనీకి ఆనుకొని రేకులకుంట చెరువు ఉంది. ఈ చెరువును 2014లో నోటిఫై చేసి లేక్​నెం-3700/ఈఎన్​/01గా కేటాయించి 15.238 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇందులోని 392 గజాల స్థలాన్ని కొందరు అక్రమార్కులు చెరువుకు అనుకొని ఉన్న దీప్తిశ్రీనగర్​కాలనీ హెచ్ఎండీఏ లేఅవుట్​లో ఉన్న ప్లాట్​నంబర్​513కి బై నెంబర్లు 513/2, 513/3, మరో ప్లాట్​516కి ఈస్ట్రర్​పార్ట్​గా నంబర్లు వేసి రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు. కానీ, దీప్తిశ్రీనగర్​ లేఅవుట్​లో ఎలాంటి బై నంబర్లు లేవని కాలనీ అసొసియేషన్​సభ్యులు చెప్తున్నారు.  

అధికారుల అండదండలు పుష్కలం 

 చెరువును నోటిఫై చేసినప్పుడు చెరువు కట్ట నుంచి కబ్జా అయిన స్థలం బఫర్​జోన్​బయట ఉందని నార్త్​ట్యాంక్​డివిజన్​డీఈఈ, ఏఈఈ ఎన్ఓసీ ఇచ్చారు. దీంతో అక్రమార్కులు స్థలానికి చెందిన రిజిస్ర్టేషన్​డాక్యుమెంట్లు, సేల్​డీడ్​, ఇరిగేషన్​శాఖ ఇచ్చిన ఎన్ఓసీతో కబ్జా చేసిన చెరువు స్థలంలో ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్​టౌన్​ప్లానింగ్ అధికారులను ఆశ్రయించారు. 

ఇరిగేషన్​శాఖ చెరువు స్థలం కాదని ఎన్ఓసీ ఇచ్చింది కదా అని 2023లో గ్రౌండ్​ ఫ్లోర్​తో పాటు ఐదంతస్థుల బిల్డింగ్​నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులిచ్చారు. దీప్తిశ్రీనగర్​కాలనీకి చెందిన లేఅవుట్1995లో హెచ్ఎండీఏ అప్రూవ్​చేసింది. ఈ టైంలో లేఅవుట్​లో ఎక్కడా బై నంబర్లు లేవు. కానీ, శేరిలింగంపల్లి జోనల్​టౌన్​ప్లానింగ్​అధికారులు ఇవేమి పరిశీలించకుండానే ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చేశారు.  

కబ్జా అయ్యిందంటూ 2020లో రెవెన్యూ రిపోర్టు

ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రేగులకుంట చెరువు స్థలం అన్యాక్రాంతం అవుతోందని 2020లో  ఫిర్యాదు చేస్తే 2020లో రాజేంద్రనగర్​డివిజన్​డిప్యూటీ ఇన్​స్పెక్టర్​సర్వే చేశారు. దీప్తిశ్రీనగర్​కాలనీలోని ప్లాట్​నంబర్​513, 515, 516, 517 రేగులకుంట చెరువుకు చెందిన1202 గజాల చెరువు స్థలాన్ని కబ్జా చేసినట్లు రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్టులో ప్రస్తుతం బై నంబర్లు వేసి నిర్మిస్తున్న స్థలం కూడా చెరువు స్థలంగానే నిర్ధారించారు. ఇదే విషయమై ఇరిగేషన్​డీఈఈగా పనిచేసి బదిలీ అయిన అధికారిని వివరణ కోరితే తాము 2014లో నోటిఫై అయిన చెరువు బఫర్​జోన్​ప్రకారం ఎన్ఓసీ ఇచ్చినట్టు చెప్పారు.  

మా కాలనీలో బై నంబర్లే లేవు.. 

మాది1995లో హెచ్ఎండీఏ అనుమతించిన లేఅవుట్. ఇప్పుడు నిర్మాణం జరుపుకుంటున్న ప్లాట్​నంబర్లు 5013/2, 513/3 అప్రూవ్​లేఅవుట్​లోఎక్కడా లేవు. కొందరు కాలనీ సొసైటీ మెంబర్లు మియాపూర్ సర్వే నంబర్101లోని ప్రభుత్వ స్థలంలో కాలనీకి చెందిన ప్లాట్​నంబర్లకు బై నంబర్లు వేని కబ్జాలకు పాల్పడి కోట్లాది రూపాయలకు అమ్మేశారు. ప్రస్తుతం రేగులకుంటకు చెందిన స్థలంలో కూడా బైనంబర్లు వేసి కబ్జాకు పాల్పడి వేరే వ్యక్తులకు అమ్మేశారు. అప్రూవ్​ లేఅవుట్​లో లేని ప్లాట్​నంబర్లకు బల్దియా ఎలా పర్మిషన్​ఇచ్చిందో తెలియడం లేదు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.

– సీతారామయ్య, దీప్తిశ్రీనగర్​కాలనీ అసొసియేషన్​ ప్రెసిడెంట్

రూ. 5 కోట్ల విలువైన చెరువు స్థలం కబ్జా చేసిండ్రు

హఫీజ్​పేట్ పరిధిలోని సర్వే నెంబర్151లో ఉన్న రేగులకుంట చెరువుకు సంబంధించి1,202 గజాల స్థలాన్ని 2020లో కబ్జా చేశారు. రాజేంద్రనగర్​ఆర్డీఓ కూడా స్థలం కబ్జాకు గురైందని సర్వే చేసి రిపోర్టిచ్చారు. ప్రస్తుతం ఇదే చెరువుకు చెందిన రూ.5 కోట్ల విలువైన 392 గజాల స్థలం కబ్జాకు గురైంది. దీనిపై ఇరిగేషన్​, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైడ్రాకు ఫిర్యాదు చేసినం..వాళ్లు పట్టించుకోవడం లేదు. –  

కసిరెడ్డి భాస్కర్​రెడ్డి, 
జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు