
న్యూఢిల్లీ: కేరళలోని ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. వాళ్లంతా పథనం తిట్టకు చెందిన వారేనని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు. అందులో ముగ్గురు ఈమధ్యే ఇటలీకి వెళ్లి వచ్చినట్టు చెప్పారు. వెనిస్ నుంచి దోహాకు ఖతార్ ఎయిర్వేస్కు చెందిన క్యూఆర్ 126, దోహా నుంచి కొచ్చికి క్యూఆర్ 514 విమానాల్లో వచ్చారన్నారు. ఎయిర్పోర్టు అధికారులకు గానీ, దగ్గర్లోని హాస్పిటల్లో గానీ వాళ్లు ఆ విషయం చెప్పలేదని తెలిపారు. జ్వరం వచ్చినా క్వారెంటైన్కు వెళ్లలేదన్నారు. ఇప్పుడు అందరినీ హాస్పిటల్కు తరలించి ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఐదుగురిని కలిసిన వారి కోసం జిల్లా హెల్త్ అధికారులు వెతుకుతున్నారని తెలిపారు. ఈ ఐదు పాజిటివ్ కేసులతో దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య 39కి పెరిగింది. ఇటలీ వాళ్లకు కొవిడ్ పాజిటివ్ రావడంతో వాళ్లు వచ్చిన బస్సును ఐటీబీపీ హెల్త్ అధికారులు డిసిన్ఫెక్టెంట్లతో క్లీన్ చేయించారు.
గురుగ్రామ్లో 420 మంది క్వారెంటైన్
గురుగ్రామ్కు చెందిన 420 మంది ఇళ్లలోనే సొంతంగా క్వారెంటైన్లో ఉన్నారు. వాళ్లకు చైనా, మలేసియా, థాయ్లాండ్ దేశాలకు వెళ్లిన ట్రావెల్ హిస్టరీ ఉండడంతో 28 రోజుల పాటు ఇళ్లలోనే క్వారెంటైన్ కావాల్సిందిగా హెల్త్ అధికారులు, వాళ్లకు సూచించారు. ఆ 420 మందికి కొవిడ్ లక్షణాలైన జలుబు, దగ్గు వంటివి ఉన్నాయని అధికారులు చెప్పారు. అందరి బ్లడ్ శాంపిళ్లను టెస్టుల కోసం పంపించినట్టు చెప్పారు. ఇక, గౌతమ్ బుద్ధ నగర్కు చెందిన 458 మంది 12 కొవిడ్ బాధిత దేశాల నుంచి వచ్చారని, వాళ్లలో 424 మందిని ఇప్పటి దాకా ట్రాక్ చేశామని చెప్పారు. 112 మంది శాంపిళ్లను టెస్టులకు పంపించగా, 54 రిపోర్టులు నెగెటివ్ వచ్చాయని, మరో 68 మంది రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు.
ఎయిమ్స్లో ఎమర్జెన్సీ వింగ్
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పేషెంట్ల కోసం ఢిల్లీ ఎయిమ్స్లోని జయ ప్రకాష్ నారాయణ్ ఎపెక్స్ ట్రామా సెంటర్లో ఎమర్జెన్సీ వింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 20 మందికి సరిపోయేలా అందులో ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. అనుమానితులను అందులో ఉంచి టెస్టులు చేయాలని, పాజిటివ్గా తేలితే వెంటనే ట్రీట్మెంట్ కోసం ఎన్సీఐ జజ్జర్కు పంపించాలని చెప్పింది. కొవిడ్ పేషెంట్ల కోసం స్పెషల్ గేట్ను ఎయిమ్స్లో ఏర్పాటు చేశారు. వాళ్ల ట్రావెల్ హిస్టరీ, లక్షణాల తీవ్రత ఆధారంగా పేషెంట్లను రెడ్, యెల్లో, గ్రీన్ కేసులుగా విభజిస్తున్నారు. ఇటు పాండిచ్చేరిలోని జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో ఐసోలేషన్ కోసం 13 బెడ్లు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. వారణాసిలోని ఓ ప్రైవేట్ స్కూల్, కరోనా రైమ్స్తో పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. వైరస్ లక్షణాలు, దాని నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైమ్స్ రూపంలో వివరిస్తోంది.
ఇటలీలో కోటిన్నర మంది బందీ
చైనా తర్వాత కొవిడ్కు ఎక్కువ మంది బలైపోతున్నది ఇటలీలోనే. అక్కడ 233 మంది కొవిడ్తో చనిపోయారు. 5,883 కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్క రోజే 1,200 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఎక్కువగా లొంబార్డిలోనే కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఆ ప్రభావం మిలాన్, వెనిస్లపైనా పడింది. కేసులు కంట్రోల్లోకి రాకపోవడంతో 1.6 కోట్ల మందిని ఆయా సిటీల్లోనే బందీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇటలీలోని నార్తర్న్ ప్రావిన్స్లను క్లోజ్ చేయాలని, అందరినీ హోం క్వారెంటైన్లో పెట్టాలని సర్కార్ ఆదేశించింది. ఇకపై ఎవరూ ఎక్కడికి వెళ్లాలన్న తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఇప్పటికే స్కూళ్లు, జిమ్లు, మ్యూజియంలు, నైట్క్లబ్ వంటి వాటిని మూసేయాల్సిందిగా ఇటలీ ప్రధాని గ్వైసెప్ కాంటీ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్లో ఒక్కరోజే 49 మంది చనిపోగా, మరణాల సంఖ్య 194కు పెరిగింది. 6,566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనాలో చనిపోయిన వారి సంఖ్య 3,098కి చేరింది. మొత్తం 80,703 కేసులు నమోదయ్యాయి. సౌత్ కొరియాలో 7,313 కేసులు నమోదవగా, 50 మంది బలయ్యారు. అమెరికాలో కొవిడ్కు బలైన వారి సంఖ్య 19కి పెరిగింది. మొత్తం 447 కేసులు నమోదయ్యాయి. స్పెయిన్లో 17, ఫ్రాన్స్లో 16 మంది కొవిడ్కు బలయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 1,07,828 పాజిటివ్ కేసులు నమోదవగా, 3,662 మంది చనిపోయారు