
50 దేశాల్లో లాక్డౌన్
కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా 50 దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో ఆయా దేశాల్లోని సుమారు 100 కోట్ల మందికి పైగా జనం ఇండ్లకే పరిమితమయ్యారు. ఫ్రాన్స్, ఇటలీ, అర్జెంటినా, అమెరికా, కాలిఫోర్నియా, ఇరాక్, రువాండా దేశాలు లాక్డౌన్ ఆంక్షలు విధించగా మరికొన్ని దేశాలు ఇండ్లల్లోనే ఉండాలని సూచించాయి. సోమవారం ఉదయం నుంచి గ్రీస్ కర్ఫ్యూ విధించగా కొలంబియా మంగళవారం, న్యూజిలాండ్ బుధవారం దేశాలను మూసేస్తున్నట్టు వెల్లడించాయి. వీకెండ్ కావడంతో బ్రిటన్లో బీచ్లు, పార్కుల్లో జనం గుమికూడారు. దీంతో అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది. మరోసారి ఇలా జరిగితే కఠినమైన ఆంక్షలుంటాయంది. బ్రిటన్లోని రైల్వే సర్వీసును అక్కడి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. రైల్వే సర్వీసును జనానికి అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
ఎట్ల చెప్తే మీకు అర్థమైతది?
ప్రజలు ఇండ్లల్లోనే ఉండాలని హెచ్చరిస్తున్నా మాట వినకపోతుండడంతో ఇటలీలోని మేయర్లు సీరియస్ అవుతున్నారు. ‘చెబితే మీకు అర్థం కాదా’ అంటూ మండిపడుతున్నారు. ఉత్తర ఇటలీలోని బారి ఇన్చార్జ్ అయిన ఆంటోనియో డెకారో పార్కుల్లో ఉన్న జనాన్ని ఇండ్లల్లోకి వెళ్లాలని చెబుతున్న వీడియో వైరలైంది. ‘ఎట్ల చెబితే మీకు అర్థమైతది. ఎలా పలకాలి. ఇండ్లల్లోనే ఉండండి’ అని ఆయన అన్నారు. జనం ఇండ్లల్లోనే ఉండాలని గట్టిగా అరుస్తూ డెలియా మేయర్ గియాన్ఫిలిపో చెప్పారు.