
- యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర
- ఆదివారం ఒక్కరోజే రూ.80.11 లక్షల ఆదాయం
- వేములవాడకు 50 వేల మంది భక్తుల రాక
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా కొండపైన, కింద ఆలయ పరిసరాలు, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపాలు, పార్కింగ్, బస్ బే ఏరియా, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. భక్తుల వాహనాలతో కొండపైన, కింద పార్కింగ్ ప్రదేశాలు నిండిపోవడంతో.. రింగు రోడ్డు వెంట వాహనాలను పార్క్ చేశారు.
కొండపైకి వాహనాలను నిలిపివేశారు. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆదివారం సుమారు 65 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయవర్గాలు వెల్లడించాయి. హైకోర్ట్ జడ్జి జస్టిస్ సీవీ.భాస్కర్రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి గర్భగుడిలో స్వయంభు నారసింహుడిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా.. పూజల అనంతరం వేదాశీర్వచనం చేసి, స్వామివారి లడ్డూ ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.
ఒక్క రోజే రూ.80.11 లక్షల ఆదాయం
నారసింహుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో, వివిధ రకాల పూజలు జరిపించడంతో ఆలయానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఒక్కరోజే రూ.80,11,461 ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.26,01,460, వీఐపీ దర్శనాల ద్వారా రూ.18.45 లక్షలు, ప్రధాన బుకింగ్తో రూ.3,74,350, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6,29,500, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.8,49,900, యాదరుషి నిలయం ద్వారా రూ.3,50,633, సత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.2,12,800 ఇన్కం వచ్చింది.
వేములవాడలో...
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్నక్షేత్రం అదివారం శివస్మరణతో మార్మోగింది. స్వామి వారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజామున నుంచే స్వామివారి కల్యాణ కట్టలో తలనీలాల సమర్పించిన అనంతరం ధర్మగుండంలో స్నానం ఆచరించారు. తర్వాత కోడెల క్యూలైన్, ధర్మదర్శనం క్యూలైన్ మీదుగా ఆలయంలో ప్రవేశించి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా ఉచిత దర్శనానికి మూడు గంటలు పట్టగా, బ్రేక్ దర్శనం కోసం గంటకుపైగా పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి వారి దర్శనం అనంతరం కోడె మొక్కులు చెల్లించారు. ఆదివారం సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆఫీసర్లు
తెలిపారు.