- అర్హత ఉన్నవారికి, ప్రశ్నించినవారికి మొండిచేయి
- నామ్ కే వాస్తేగా తయారైన ప్రస్తుత పాలకమండలి
సికింద్రాబాద్, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీ అక్రమాలకు కేంద్రంగా మారిపోయింది. అధికార యంత్రాంగం ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థి సంఘాలు, సీనియర్అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. అర్హతలు లేని వారికి కూడా పదోన్నతులు కల్పించారంటూ ఆరోపిస్తున్నారు. సీనియారిటీ ఆధారంగా అసిస్టెంట్ప్రొఫెసర్ నుంచి అసోసియేట్, అసోసియేట్నుంచి ప్రొఫెసర్గా, ప్రొఫెసర్నుంచి సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతులు కల్పిస్తారు. యూజీసీ రూల్స్ మేరకు ఒక ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్ కావాలంటే పదేళ్ల బోధనా అనుభవం, సదరు అధ్యాపకుని పర్యవేక్షణలో ఇద్దరు పీహెచ్డీలు చేసి ఉండాలి. వీటితో పాటు యూజీసీ ఆమోదించిన కేర్ లిస్ట్లో పది ఆర్టికల్స్ ప్రచురితమై ఉండాలి. వీటిని పరిగణలోకి తీసుకునే ఏ వర్సిటీ అయినా సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి కల్పిస్తుంది. అయితే.. ఏడాదిలో వివిధ దఫాలుగా 53 మంది అధ్యాపకులు సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతికి దరఖాస్తు చేసుకోగా, వారిలో 51 మందికి ఓయూ అధికారులు అక్రమంగా ప్రమోషన్లు కల్పించారు. జాగ్రఫీ డిపార్ట్ మెంట్ కు చెందిన ఓ ప్రొఫెసర్సీనియర్ప్రొఫెసర్గా పదోన్నతి పొందిన కొన్ని నెలల తర్వాత తప్పుడు సమాచారం, జర్నల్స్లో తప్పుడు ఆర్టికల్స్ ప్రచురించి పదోన్నతి పొందానని, రద్దు చేయాలని కోరుతూ ఓయూ అధికారులకు లేఖ రాశారు. దీంతో హడావిడిగా అధికారులు తాము చేసిన తప్పిదంపై ఆయన ద్వారానే తెలుసుకుని వెంటనే రద్దు చేయడమే కాకుండా పదోన్నతి కాలానికి ఆయన తీసుకున్న అదనపు వేతనాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా స్వతహాగా బయటకు వచ్చింది ఒకరే అయినా అక్రమంగా చాలా మంది అధ్యాపకులు పదోన్నతులు పొందారని, అందులో అధికారుల పక్షానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని పలువురు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. పదోన్నతులు పొందిన వారిలో సుమారు 25 నుంచి 30 మందికి అర్హతలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. వీసీ తనకు నచ్చిన వారికి పదోన్నతులు కల్పించి, తన విధానాలపై ప్రశ్నించిన వారికి మొండిచేయి చూపారని పలువురు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. సైన్స్డిపార్ట్ మెంట్ కు చెందిన ప్రొఫెసర్కు రూల్స్ మేరకు రెండు పీహెచ్డీలు, 30 ఆర్టికల్స్ఉన్నా పదోన్నతి కల్పించలేదు. ఓ మహిళా అధ్యాపకురాలికి సెలక్షన్కమిటీ ఇంటరాక్షన్లో తెలుగులో మాట్లాడారని పదోన్నతి నిరాకరించారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత వర్సిటీ పాలకమండలి నామమాత్రంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోనే వర్సిటీలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ముగ్గురు అధ్యాపకులతో విచారణ కమిటీ..
ఓయూలో సీనియర్అధ్యాపకుల పదోన్నతుల్లో జరిగిన అవకతవలకపై ప్రభుత్వం మాజీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఇది విచారణ చేపట్టి 10 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కమిటీ వర్సిటీలో పర్యటిస్తూ పలువురు అధ్యాపకుల నుంచి వివరాలు సేకరిస్తుంది.
అవకతవకలపై ప్రభుత్వానికి విన్నవించాం
సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో ఎన్నో అవకతవకలు జరిగాయి. అర్హత లేని వారికి పదోన్నతులు కల్పించారు. ఇది అన్యాయమని వీసీని ప్రశ్నించగా స్పందించలేదు., ఆపై ప్రశ్నించిన అధ్యాపకులకు నోటీసులు ఇచ్చారు. దీంతో తాము ప్రభుత్వాన్ని ఆశ్రయించి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరాం. ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది.
- ప్రొఫెసర్ మనోహర్రావు, ఔటా అధ్యక్షుడు
యూజీసీ రూల్స్ మేరకే పదోన్నతులు కల్పించాం
యూజీసీ రూల్స్ మేరకే అధ్యాపకులకు సీనియర్ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించాం. ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఇంటర్వ్యూలు నిర్వహించాకే పదోన్నతులు ఇచ్చాం. కావాలనే కొందరు అధ్యాపకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యూనివర్సిటీని బదనామ్ చేయడమే తప్ప మరొకటి లేదు.
- ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, రిజిస్ర్టార్