
ఎంపీ కె.లక్ష్మణ్ ప్రశ్నలకు కేంద్ర మంత్రుల సమాధానాలు
న్యూఢిల్లీ, వెలుగు: సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద తెలంగాణలోని 9 మెడికల్ కాలేజీలలో 511 పీజీ సీట్లను పెంచామని కేంద్ర మంత్రి డా.భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన కింద మూడు మెడికల్ కాలేజీలలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలాగే బీబీనగర్ లో ఎయిమ్స్ పెట్టినట్లు బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2023-–24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని మొత్తం 46 మెడికల్ కాలేజీల్లో 7,415 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇందులో 27 ప్రైవేట్ కాలేజీల్లో 4,400 సీట్లు, 19 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 3,015 సీట్లు ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 2014లో 387 మెడికల్ కాలేజీలు ఉంటే 71 శాతం పెరుగుదలతో ఇప్పుడు 600 మెడికల్ కాలేజీలు ఉన్నాయని వెల్లడించారు. 2014తో పోలిస్తే దాదాపు 97శాతం ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయన్నారు. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51,348 నుంచి 1,01,043 సీట్లకు చేరుకున్నట్లు చెప్పారు. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 52,778 సీట్లు ఉండగా, ప్రైవేటు కాలేజీలలో 48,265 సీట్లు ఉన్నాయని వివరించారు. 2014లో 31,185 పీజీ సీట్లు ఉండగా.. ప్రస్తుతం 110 శాతం పెరిగి 65,335 పీజీ సీట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.
అన్ని సిటీల్లో సాలిడ్ వేస్ట్ ప్రాజెక్టులు
తెలంగాణలోని అన్ని సిటీల్లో 38.4 ఎండబ్ల్యూ కెపాసిటీ ఉన్న మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయని లక్ష్మణ్ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ మంత్రి ఆర్కే సింగ్ బదులిచ్చారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కేంద్రానికి సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కింద ఈ ప్రాజెక్ట్లకు ఇన్పుట్గా 40 టీపీడీ, 20 టీపీడీ కెపాసిటీతో పీపీపీ పద్ధతిలో తడి చెత్త మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఉన్నట్లు వెల్లడించారు.
4,657 మెగావాట్ల సోలార్ పవర్
రాష్ట్రంలో 90.87 మెగావాట్ల స్మాల్ హైడ్రోపవర్, 128.10 మెగావాట్ల పవన్ విద్యుత్, 220.37 మెగావాట్ల బయో పవర్, 4,657.18 మెగావాట్ల సోలార్ పవర్, 501.60 మెగావాట్ల లార్జ్ హైడ్రోపవర్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు మరో కేంద్రమంత్రి ఆర్.కె.సింగ్.వెల్లడించారు.