
బెల్ ఫాస్ట్: జర్మనీ దివంగత నియంత అడాల్ఫ్ హిట్లర్కు చెందిన పెన్సిల్ వేలంలో రూ.5.5 లక్షలకు అమ్ముడుపోయింది. అంతకుముందు ఈ పెన్సిల్ రూ.50 లక్షలకు అమ్ముడవుతుందని భావించారు. కానీ, అంచనా వేసిన విలువలో పదో వంతు మాత్రమే పలికింది. పురాతన వస్తువులను వేలం వేసే బ్లూమ్ ఫీల్డ్ సంస్థ బెల్ఫాస్ట్లో మంగళవారం ఈ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించింది. 1941 ఏప్రిల్ 20న హిట్లర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లవర్ ఇవా బ్రౌన్ ఈ పెన్సిల్ను గిఫ్ట్ గా ఇచ్చింది. దానిపై ‘ఏహెచ్’ (అడాల్ఫ్ హిట్లర్) అని చెక్కి ఉంది. వాస్తవానికి ఈ పెన్సిల్ను 2002లో ఓ కలెక్టర్ కొన్నాడు. పెన్సిల్తో పాటు నాజీ జర్మనీకి చెందిన మరికొన్ని వస్తువులను కూడా వేలం వేశారు. ఈ వేలంపాటపై యూరోపియన్ యూదుల అసోసియేషన్ చైర్మన్ రబ్బీ మెనకం అభ్యంతరం వ్యక్తంచేశారు. హిట్లర్ దురగాతాలకు బలైన వారిని అవమానించడమే అని రబ్బీ వర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకూ బ్లూమ్ ఫీల్డ్ వేలంపాట అవమానకరమని పేర్కొన్నారు.