- యాప్స్ ద్వారా కొనుగోళ్లు భారీగా పెరిగినయ్
- చిన్న సిటీలకూ విస్తరించిన ఈ– కామర్స్
- ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ రిపోర్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఆన్లైన్ షాపింగ్కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. యాప్స్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేయడానికి 60 శాతం మంది ఆసక్తి చూపుతున్నారని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) ఇండియా విడుదల చేసిన రిపోర్టులో వెల్లడించింది. గడిచిన కొన్నేండ్లలో 12.5 కోట్ల మంది ఆన్లైన్లో షాపింగ్ చేశారని రిపోర్ట్ తెలిపింది. రిపోర్టులో ఉన్న వివరాల ప్రకారం.. బయట షాపుల్లో సరుకులు తక్కువగా దొరకడం లేదా స్టాక్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది ఆన్లైన్ షాపింగ్ వైపు మళ్లుతున్నారు.
ఆన్లైన్ లో లేటెస్ట్ పాపులర్ ప్రోడక్ట్స్ ఎక్కువగా అందుబాటులో ఉండడం, డిస్కౌంట్లు, రిఫండ్స్, నావిగేషన్, రివ్యూస్, రేటింగ్ వంటి సౌకర్యాల కారణంగా ఆన్ లైన్ లో షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి కాలంలో టైర్ 2, 3, 4 నగరాల్లోనూ ఆన్లైన్ షాపింగ్ విస్తరించింది. నిరుడు పండగల సమయంలో కొన్ని కంపెనీల యాప్స్ నుంచి 80 శాతంపైగా ప్రోడక్ట్స్ను కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన 2,100 మందిని సర్వే చేసి వివరాలు సేకరించామని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది.
సోషల్ మీడియాలో చూసి...
ఆన్లైన్ కొనుగోళ్లలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, యూ ట్యూబ్ లాంటి సాధనాలు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఆన్లైన్లో కొను గోలు చేసేవారు ఎక్కువగా సోషల్ మీడియాలో చూసి కొనుగోలు చేస్తున్నారని పీడబ్ల్యూసీ రిపో ర్టు తెలిపింది. సోషల్ మీడియాలో చూసి కొత్త బ్రాండ్స్ను ట్రై చేసేవారు 62 శాతం మంది ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది. బయట షాపులతో పోలిస్తే ఆన్లైన్లో తక్కువ ధరలు ఉండడం, పండుగల టైమ్లో డిస్కౌంట్స్, రిఫండ్లు ఇవ్వడంతో ఆన్ లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయని నివేదిక తెలిపింది. రేటింగ్స్, రివ్యూస్ చూసి షాపింగ్ చేసేవారు 45%, క్యాష్ ఆన్ డెలివెరీ ఆప్షన్ ఎంచుకునేవారి శాతం 35 ఉందని నివేదిక వెల్లడించింది.