న్యూఢిల్లీ: లాక్డౌన్.. ఆటో మొబైల్ డీలర్లపై పీక మీద కత్తిలా మారింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ డెడ్లైన్ ఇంకో వారం రోజుల్లో ముగియనున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, సిటీలు లాక్డౌన్లో ఉన్నాయి. ప్రజలు బయటకు రావడం లేదు. ఇంకా టైమున్నప్పటికి 7 లక్షలకు పైగా బీఎస్4 టూవీలర్స్ డీలర్ల వద్ద మిగిలిపోతాయని, 12,000 పైగా ప్యాసెంజర్ వెహికల్స్, 8,000 కి పైగా కమర్షియల్ వెహికల్స్ అమ్ముడవ్వవని డీలర్స్ బాడీ ఫాడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయరన్న విషయం తెలిసిందే. ఈ డెడ్ లైన్ మే చివరి వరకు పొడిగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోషియేషన్(ఫాడా) సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. దేశంలో 26,000 డీలర్షిప్లకు ఫాడా ప్రాతినిధ్యం వహిస్తోంది.
పరిస్థితులు మా చేయి దాటాయి..
డెడ్ లైన్కు ముందే బీఎస్ 4 వాహనాలను వదిలించుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేవని ఫాడా తెలిపింది. లాక్డౌన్ వలన ప్రజలు బయటకే రావడం లేదని ఫాడా ఫ్రెసిడెంట్ ఆశీష్ కాలే అన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎటువంటి అమ్మకాలు చేయలేమని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్లో మరింత కఠినమవొచ్చని అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మా చేయి దాటాయని, ఇప్పుడు డీలర్ ఏం చేయలేడని ఆశీష్ అన్నారు. సుప్రీం కోర్టులో ఫాడా వేసిన పిటీషన్ ఈ నెల 27 న హియరింగ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ డేట్కు ముందే తమ పిటీషన్ను పట్టించుకోవాలని ఫాడా సుప్రీం కోర్టును కోరింది. ఒక వేళ సుప్రీం కోర్టు హియరింగ్ జరగకపోతే, ఓఈఎంలకు బీఎస్ 4 స్టాకును రిటర్న్ చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ఈ విషయంలో ఒరిజినల్ ఎక్యుప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్(ఓఈఎం) లతో చర్చిస్తామని తెలిపారు. లేకపోతే ఈ నష్టాన్ని చాలా మంది డీలర్లు భరించలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో వెహికల్స్ కొనడానికి కస్టమర్లు ఆసక్తి చూపించడం లేదని, ఒక వేళ కొనాలని ఉన్నా తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారని ఆశీష్ అన్నారు. ఇప్పటికే బుకింగ్స్ చేసుకున్న కస్టమర్లు కూడా డెలివరీ తీసుకోవడానికి వెనుకడుగేస్తున్నారని తెలిపారు. షో రూమ్లకు వెళ్లి వెహికల్స్ కొనుగోలు చేయడానికి కస్టమర్లు భయపడుతున్నారని, అందుకే టూ వీలర్ సెగ్మెంట్లో 70 శాతానికి పైగా బీఎస్ 4 వెహికల్స్ అమ్ముడు కాకుండా ఉండిపోయాయని అన్నారు.