- సిటీలో రోజుకు 1200కు పైగా కొత్తవి రిజిస్ట్రేషన్
- 30 లక్షల బండ్లు ట్రావెల్
- మెట్రో, ఫ్లై ఓవర్లు వచ్చినా వాహనదారులకు తప్పని ట్రాఫిక్ కష్టాలు
- పెరుగుతున్న వెహికల్స్కు అనుగుణంగా లేని రోడ్ల విస్తీర్ణం
హైదరాబాద్, వెలుగు : దేశంలో కాస్మోపాలిటన్ సిటీగా హైదరాబాద్కి పేరుంది. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో సిటీకి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే, ఇలాంటి గ్లోబల్ సిటీలో జనాలను ట్రాఫిక్ సమస్యలు వెంటాడుతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న వెహికల్స్ సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగడం లేదు. మెట్రో రైల్స్, ఫ్లై ఓవర్స్ ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోతున్నది. ఇందుకు కారణం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు 1,200కు పైగా కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రతరం కానున్నాయి.
కోటి జనాభా.. కోటిన్నర వెహికల్స్
హైదరాబాద్ జనాభా కోటికి పైగా దాటిపోయింది. ప్రతి ఇంట్లో కారు, బైక్ తప్పనిసరి అయింది. గ్రేటర్ పరిధిలో మొత్తం తొమ్మిది వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉన్నాయి. ఇందులో1,500 కిలో మీటర్ల మెయిన్ రోడ్లు ఉన్నాయి. ఆర్టీఏ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కోటి 54 లక్షల 77 వేల 512 వాహనాలు రిజిస్టర్ అయితే వీటిలో దాదాపు 70 శాతం గ్రేటర్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో రిజిస్టర్ అయ్యాయి. ఇందులో గ్రేటర్ రోడ్లపై రోజూ దాదాపు 30 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే రోజూ 15 లక్షలకు పైగా ట్రావెల్ చేస్తున్నాయి.
సరైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేక అవస్థలు..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను వెంటాడుతున్న సమస్యల్లో ట్రాఫిక్ అతి పెద్ద సమస్య. ఆర్టీసీ బస్సులు, క్యాబ్స్, వ్యక్తిగత వాహనాలు ఇలా ఏ వెహికల్లోనైనా సరే సిటీలో ట్రావెల్ చేయాలంటే ట్రాఫిక్లో నరకం చూడాల్సిందే. జనాభాకు అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేకపోవడంతో సిటిజన్స్ సొంత వాహనాలు, ప్రైవేటు వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్లు, బైక్స్ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం మెట్రో రైలు, ఫ్లై ఓవర్స్ అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేకుండాపోతున్నది.
దారుణంగా రోడ్లు..
కరోనా తర్వాత సొంత వాహనాల వాడకం ఎక్కువ కావడంతో సిటీలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది. దీంతో ఫ్లై ఓవర్లు, వాటర్ పైప్లైన్స్, డ్రైనేజీ నిర్మాణం కోసం జరుగుతున్న తవ్వకాలు ట్రాఫిక్కు ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఇందుకు కారణమవుతోందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. అడ్డగోలుగా రోడ్లపై తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులకు కష్టాలు తప్పట్లేదు. వర్షాకాలం పరిస్థితిమరీ దారుణంగా మారుతోంది. మోకాలి లోతు నీటిలో నరకం చూస్తున్నారు.