
వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం భక్తుల తాకిడి ఎక్కువ అయ్యింది. గురువారం (మే 22) రికార్డు స్థాయిలో శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. సాధారణంగా గురువారం ఉదయం తిరుప్పావడ సేవ, సాయంత్రం పూలంగి సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శనం రెండు మూడు గంటలు తగ్గుతుంది. అందువల్ల ఈ సమయంలో కేవలం 62 నుండి 63 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు.
కానీ తొలిసారి గురువారం 72 వేల579 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అన్ని విభాగాల సమన్వయంతో ఇది సాధ్యమైందని ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. అందుకు సహకరించిన అన్ని విభాగాల సిబ్బందిని అభినందించారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వలన అదనపు ఈవో దగ్గరుండి ఏర్పట్లను సమన్వయ రిచారు. అర్థరాత్రి వరకు తిరుమలలోని అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ, దాదాపు పదివేల మందికి పైగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగిందని టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.