లక్నో: ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఓ బిల్డింగులో ఉన్న లిఫ్ట్ 8వ అంతస్తు నుంచి అమాంతం కిందపడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ఐటీ ఉద్యోగులు గాయపడ్డారు. అందులో ఐదుగురికి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. నోయిడా సెక్టార్ 125లో ఉన్న రివర్ సైడ్ టవర్ బిల్డింగులో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. బిల్డింగ్ ఎనిమిదవ అంతస్తులో ఎరాస్మిత్ టెక్నాలజీస్ అనే ఐటీ కంపెనీ ఉంది. సాయంత్రం 5.45 గంటలకు ఉద్యోగులు పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు.
బిల్డింగ్ నుంచి కిందకు దిగేందుకు తొమ్మిది మంది ఉద్యోగులు లిఫ్ట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఉన్నట్టుండి లిఫ్ట్ ఒక్కసారిగా 8వ అంతస్తు నుంచి కిందకు పడిపోయింది. ప్రమాదంలో 9 మంది టెకీలకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా.. ఐదుగురిని డాక్టర్లు ఐసీయూలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మెయింటెనెన్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.