సోనూసూద్​ని కలిసేందుకు కాలినడకన ముంబై

సోనూసూద్​ని కలిసేందుకు కాలినడకన ముంబై

హైదరాబాద్, వెలుగు: సినీ నటుడు సోనూసూద్​ను కలిసేందుకు అతని అభిమాని ఒకరు హైదరాబాద్​ నుంచి ముంబై కాలినడకన బయలుదేరాడు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునుగలవేడుకు చెందిన రఘుబాబు సోమవారం ఉదయం 6 గంటలకు సిటీలోని బంజారాహిల్స్​నుంచి స్టార్ట్​అవ్వగా మధ్యాహ్నానికి రంగారెడ్డి జిల్లాలోని మోకీల చేరుకున్నాడు. ఈ సందర్భంగా వెలుగు ప్రతినిధి అతనితో మాట్లాడగా రాత్రికి సంగారెడ్డిలో బస చేసి ముంబై హైవేపై తన పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పాడు. తనకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని ఏడాది నుంచి సోనూసూద్​పై చెప్పలేనంత అభిమానం పెరిగిందని వివరించాడు. ఆపదలో ఆదుకుంటున్న రియల్ హీరోను కలిసేందుకు పాదయాత్రగా వెళుతున్నట్లు తెలిపాడు. కాగా ఇటీవలే వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ అభిమాని కూడా ఇదే విధంగా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లి సోనూసూద్​ని కలిశాడు.