నిజామాబాద్, వెలుగు: పార్టీ పదవుల కోసం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అగ్రనేతల మధ్య పోరు నడుస్తోంది. పీసీసీలో బీసీ నేతలకు పదవులు రాకపోవడంతో అసంతృప్తి పెరుగుతోంది. అగ్రనేతలు మహేశ్ గౌడ్, మధుయాష్కీ, సుదర్శన్ రెడ్డి , తమ అనుచరులకు పదవులు ఇప్పించుకనేందుకు పోటీ పడ్డారు. కానీ, సుదర్శన్ రెడ్డి వర్గీయులకే పెద్దపీట దక్కింది. జిల్లా ప్రెసిడెంట్ , పీసీసీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పోస్ట్ లు మాజీ మంత్రి వర్గీయులకే దక్కడంతో మిగిలిని ఇద్దరు నేతలు అసంతృప్తికి గురయ్యారు. పార్టీలు మార్చిన నేతలకే ప్రాధాన్యం ఇచ్చారని స్థానిక నేతలు అనుకుంటున్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆ వర్గం నేతలు నిరాలో ఉన్నారు.
సీనియర్లకు నిరాశ
బీసీ సెల్ జిల్లా మాజీ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్ డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ను ఆశించారు. జిల్లా ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ కేశవేణు, అర్బన్ నేతలు పీసీసీలో పదవులు ఆశించారు. 35 సంవత్సరాలుగా శేఖర్ గౌడ్, కేశ వేణు పార్టీలో పనిచేస్తున్నారు. వేణు ఎన్ఎస్యూఐ లో విద్యార్థి స్థాయి పని చేస్తూ యూత్ కాంగ్రెస్ అర్బన్ ప్రెసిడెంట్గా 10 ఏండ్లు, పార్టీ అర్బన్ ప్రెసిడెంట్ గా 12 ఏళ్లు పనిచేశారు. కొన్ని నెలలు జిల్లా ఇన్ ఛార్జ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. బీసీనేతలైన కేశవేణుకు, శేఖర్ గౌడ్ లో ఒకరికి డీసీసీ ప్రెసిడెంట్ పదవి దక్కుతుందని ఆశించారు. కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మోహన్ కు పదవి రావడంతో వీళ్లు నిరాశకు గురయ్యారు. బీసీ నేత, మాజీ విప్ ఈరవత్రి అనీల్ ను జిల్లా ప్రెసిడెంట్ ను చేయాలని ప్రపోజల్ ఉండగా.. ఆయన తిరస్కరించారు. దీంతో సిట్టింగ్ ప్రెసిడెంటే పదవిలో కొనసాగించాలని నిర్ణయించారు. రూరల్ అసెంబ్లీలో కీలకనేతగా శేఖర్ గౌడ్ కు పదవి రాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ వర్గం అడ్డుపడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతల మధ్య అంతర్గత పోరు మొదలైంది. కానీ పార్టీ పదవుల్లో బీసీలకు చోటు లేకుండా సుదర్శన్ రెడ్డి అడ్డుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు పీసీసీలో జిల్లా మాజీ ప్రెసిడెంట్ తాహెర్ బిన్ హందాన్ కు వైస్ ప్రెసిడెంట్పదవి దక్కింది. సీనియర్ నేతలు గంగాధర్, నగేశ్ రెడ్డి కి జనరల్ సెక్రటరీ పదవులు వచ్చాయి. ఒకే వర్గానికి చెందిన వీరికి పదవులు రావడంతో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎడాదిగా లొల్లి..
ఎడాది క్రితం పీసీసీ ప్రచారకమిటీ చైర్మన్ గా మధుయాష్కి, వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేశ్ గౌడ్ నియమితులయ్యారు. అనంతరం జిల్లా పర్యటనలో స్వాగత సభకు , బోధన్ లో జరిగిన కాంగ్రెస్ సభకు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి రాకపోవడంతో విబేధాలు ఏర్పడ్డాయి. బోధన్ ముఖ్య నేతలతో హైదరాబాద్ లో కాంగ్రెస్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు మధుయాష్కీ, మహేశ్ గౌడ్ గైర్హాజరయ్యారు. అక్కడ రేవంత్ రెడ్డి జోక్యంతో విబేధాలకు తెరపడినట్టేనని అనుకున్నారు. కానీ, నిజామాబాద్లో కాంగ్రెస్ సభ్యత్వ జిల్లా రివ్యూ మీటింగ్ మధుయాష్కీపై క్రమ శిక్షణ చర్యలకు మాజీ ఎమ్మెల్యే అనిల్ తీర్మానం పెట్టారు. మళ్ళీ ఎస్టీసెల్ జిల్లా ప్రెసిడెంట్పదవి నియామకంతో నేతల మధ్య మరో విబేధాలు వచ్చాయి. పీసీసీ పదవుల కోసం మళ్లీ ముగ్గురి నేతల మధ్య లొల్లి మొదలైంది.
పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా..
నాకు పోస్ట్ వచ్చినా, రాకపోయినా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను. బీసీ నేతలకు తగిన ప్రయార్టీ ఇవ్వాల్సింది. 35 ఏండ్ల నుంచి జిల్లాలో పార్టీ బలోపేతానికి కష్టపడ్డాను. పదవులకు కాదు ప్రజాసమస్యలపై పోరాడతాను. నేతల ఆధిపత్యపోరు వల్ల పోస్ట్ రాలేదనదీ అసత్యం . కష్టపడ్డవారికి పార్టీలో న్యాయం చేస్తారని నమ్మకం ఉంది.
- కేశ వేణు