కలియుగ వైకుంఠం తిరుమల ఏడుకొండల పరిధిలో విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరవేయకూడదు. అయితే.. శుక్రవారం ( డిసెంబర్ 5 ) తిరుమల శిలాతోరణం దగ్గర డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. ఓ వ్యక్తి శిలాతోరణం దగ్గర డ్రోన్ ఎగరేస్తుండగా గుర్తించారు స్థానికులు. అతన్ని పట్టుకొని వెంటనే విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ఎగరేసిన వ్యక్తి విదేశీయుడిగా ప్రాధమికంగా గుర్తించారు అధికారులు. అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు విజిలెన్స్ అధికారులు.
డ్రోన్ ఎగరేసిన భక్తుడు న్యూయార్క్ లో స్థిరపడిన, రాజాస్థాన్ జైపూర్ కు చెందిన ప్రవాస భారతీయుడు సుభం ఖండేవాల్ గా గుర్తించినట్లు తెలిపారు అధికారులు. అలిపిరి చెక్ పాయింట్ లో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి డ్రోన్ ను తిరుమలకు తీసుకొచ్చినట్లు తెలిపారు. నిభందనలకు విరుద్ధంగా డ్రోన్ కెమరాను తిరుమలకు తీసుకొచ్చిన ఎన్ఆర్ఐ భక్తుడిని విచారిస్తున్నారు విజిలెన్స్ అధికారులు.
తిరుమల కొండపై విమానాలు, డ్రోన్లు వంటివి ఎగరడం ఇది కొత్త కాదు.. గతంలో కూడా పలుసార్లు తిరుమల కొండపై విమానాలు, డ్రోన్లు ఎగరడం కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు.
