రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్: ఎర్రబెల్లి

రేవంత్ రెడ్డి  చంద్రబాబు ఏజెంట్: ఎర్రబెల్లి

ఓటమే ఎరుగని నాయకున్నని, ఎక్కడ పోటీ చేసినా గెలుస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేస్తున్న పాదయాత్రలపై ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర పేరుతో రేవంత్ రెడ్డి కార్లల్లో తిరుగుతున్నాడని ఆరోపించారు. కొన్ని గ్రామాలలోకి‌ కాంగ్రెస్ పార్టీ నాయకులే రానివ్వడం లేదన్న ఆయన.. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని చెప్పారు. చంద్రబాబు ఏజెంటుగా రేవంత్ రెడ్డి వెల్లాడని, తెలంగాణ కోసం పట్టుబట్టి చంద్రబాబుతో మొదటగా లెటర్ ఇప్పించామన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడన్న ఎర్రబెల్లి... తన రాజకీయ చరిత్రలోనే తనపై చిన్న కేసు కూడా లేదని తెలిపారు. 

తనకు చదువురాదన్నారని, తాను చదివింది ఇంటర్ మీడియట్ అని.. కానీ తాను ప్రజల మనోభావాలు చదివానని, మీలా ప్రజలను ఎలా మోసం చేయాలో చదవలేదని ఎర్రబెల్లి సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిశానన్న ఆయన... మంత్రినయ్యానని చెప్పారు. కేసిఆర్ గురించి, నా గురించి మాట్లాడే అర్హత లేదని ఎర్రబెల్లి తేల్చి చెప్పారు. తాను భూమి కబ్జా చేశానని ఋజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

షర్మిల పిచ్చి పిచ్చి మాటలు మానుకో అని ఎర్రబెల్లి హెచ్చరించారు. ప్రజల్లో మీకు స్పందన లేదని, మీ పాదయాత్ర బంద్ చేయాలంటే నిమిషం పట్టదని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలే ఆపాలని చూస్తున్నారన్న ఆయన... వాళ్లే ఉరికించి కొడతారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి రేవంత్ రెడ్డికి, షర్మిలకు కనపడటం లేదా.. అని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు.  కరువు గడ్డ జనగామకు నీళ్లు తెచ్చిన ఘనత మాదని గొప్పగా చెప్పుకున్నారు.  కేసిఆర్ నాయకత్వంలో డబ్బులు విడుదల చేసి కాల్వలతో రిజర్వాయర్లు నింపామని చెప్పారు. వీరిద్దరూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పాదయాత్ర లో 500 మందిని కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్నారన్న ఆయన.. మహారాష్ట్ర నుండి, కాళేశ్వరం నుండి ఉమ్మడి వరంగల్ కు పుష్కలంగా నీళ్లు వస్తున్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు తుపాకీ వెంకటి రామునిలా ఉంటాయని ఎర్రబెల్లి కామెంట్ చేశారు.