భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ వాహన తయారీదారు సంస్థ ఎథర్ ఎనర్జీ.. తమ కార్యక్రమాలను తమిళనాడులోని హోసూర్లో ఉన్న తమ భారీ కర్మాగారంలో 02 జనవరి 2021వ తేదీ నుంచి ఆరంభించింది. అప్పటి నుంచి ఎథర్ ఎనర్జీ తమ వాహనాల డెలివరీలను ముంబై, పూనె, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ వంటి నగరాలలో ప్రారంభించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసం నాటికి దశల వారీగా భారతదేశంలో ఇతర నగరాలలోనూ ఎథర్ ఎనర్జీ తమ డెలివరీలను అందించనుంది.
మేక్ ఇన్ ఇండియా విజన్ కు ఎథర్ ఎనర్జీ ఓ ఖచ్చితమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సంస్థ యొక్క ఉత్పత్తులలో 90% స్థానికమైనవే. ఎథర్ 450 ఎక్స్ మరియు ఎథర్ 450 ప్లస్ వంటి బ్యాటరీ ప్యాక్లను ఎథర్ సొంతంగా తయారుచేస్తోంది. ఏడాదికి 110000 స్కూటర్లను తయారు చేసే సామర్థ్యం కలిగిన ఈ కేంద్రం, ఎథర్ ఎనర్జీ యొక్క జాతీయ ఉత్పత్తి కేంద్రంగా నిలువడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ను తీర్చనుంది. 120000 బ్యాటరీ ప్యాక్లను సైతం తయారుచేసే సామర్థ్యం ఈ సంస్థకు ఉంది.
తమిళనాడు ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి ఈవీ పాలసీ కింద మద్దతునందించింది. ఈవీ తయారీతో పాటుగా ఈ కేంద్రంలో లిథియం–అయాన్ బ్యాటరీ తయారీపై కూడా దృష్టి సారించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడుతున్నాయి. ఈవీ రంగంలో అవసరమైన నైపుణ్యాలను పొందడం కోసం 4వేల మందికి పైగా ఉద్యోగులకు రాబోయే ఐదేళ్లలో శిక్షణను అందించనున్నారు.
ఎథర్ ఎనర్జీ సీఈవో అండ్ కో–ఫౌండర్, తరుణ్ మెహతా మాట్లాడుతూ …భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి తమ కంపెనీ అణుగుణంగా ఉంటుందని, తమ ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ ను తీర్చగలమని చెప్పారు. తమ ఉత్పత్తులను మొదటి నుంచి డిజైన్ చేసి రూపొందిస్తుండటం పట్ల గర్వంగా ఉన్నామని తెలిపారు. ఇందుకు తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు .