హైదరాబాద్​ లో దారుణం.. ప్రేమను నిరాకరించిందని యువతిపై దాడి

హైదరాబాద్​ లో దారుణం.. ప్రేమను నిరాకరించిందని యువతిపై దాడి

హైదరాబాద్ మియాపూర్లో ఓ యువతిపై యువకుడు దాడి చేశాడు. ప్రేమను నిరాకరించిందనే కారణంతో యువతిపై దాడి చేసి..ఆ తర్వాత తాను గొంతు కోసుకున్నాడు. దాడి చేసిన వ్యక్తిని సందీప్ గా పోలీసులు గుర్తించారు. బాధితురాలిని కొండాపూర్ కిమ్స్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో   దర్యాప్తు చేస్తున్నారు. 

గత మూడేళ్లుగా సందీప్, బాధిత యువతి ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సందీప్ ను సదరు యువతి పట్టించుకోకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే యువతి ఇంటికి వెళ్లిన సందీప్.. ఆమెను, ఆమె తల్లిని కత్తితో పొడిచి తాను గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ తల్లీ కూతుళ్లను కిమ్స్ కు తరలించారు. గొంతు కోసుకున్న సందీప్ ను సికింద్రాబాద్​ గాంధీ హాస్పిటల్ కు పోలీసులు తరలించారు. యువతి తల్లి, నిందితుడు సందీప్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ ఘటన పై మాదాపుర్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు.  సందీప్, యువతి ప్రేమించుకున్నారని, ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిందని తెలిపారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో విడిపోయారని చెప్పారు. యువతికి మరొకరితో వివాహం జరుగుతుందని తెలుసుకున్న సందీప్.. హైదరాబాద్ కు వచ్చి ఈరోజు ఉదయం యువతి తల్లితో గొడవ పెట్టుకున్నాడని, ఈ క్రమంలో వారిపై సందీప్ కత్తితో  దాడి చేసి, అతను కూడా గొంతు కోసుకున్నాడని  శిల్పవల్లి చెప్పారు. ప్రస్తుతం బాధితురాలు, ఆమె తల్లి ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని, యువతికి ప్రాణాపాయం తప్పిందన్నారు. యువతి తల్లి, నిందితుడు సందీప్ పరిస్థితి విషమంగా ఉందని డీసీపీ వెల్లడించారు.