
న్యూఢిల్లీ: సెల్ఫోన్ దొంగతనం చేశాడని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన నార్త్ ఢిల్లీలోని సరై రోహిల్లా ప్రాంతంలో జరిగింది. ఈ ఘటన వివరాలను డిప్యూటీ పోలీస్ కమిషనర్(నార్త్) సోమవారం వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇజార్(19) అనే వ్యక్తి రోహిల్లా ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోకి వెళ్లి ఓ మొబైల్ ఫోన్ దొంగిలించాడు. అతను దొంగతనం చేస్తున్నప్పుడు అదే ఫ్యాక్టరీలో పనిచేసే గ్యాని అనే వ్యక్తి చూసి, ఇజార్ను పట్టుకున్నాడు. ఆ తర్వాత తోటి వర్కర్లను పిలిచి ఇజార్ను ఫ్యాక్టరీ నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. తర్వాత అందరూ కలిసి ఇజార్పై దాడి చేశారు. ప్లాస్టిక్ పైపులు, బెల్ట్లతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. మరోసారి దొంగతనం చేయకుండా బుద్ధి చెప్పేందుకు ఇజార్ తల వెంట్రుకలను కట్ చేశారు. తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దెబ్బలతో మృతి..
వాళ్లు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ఇజార్ మృతిచెందాడు. రోడ్డుపై డెడ్బాడీ పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డెడ్బాడీ ఉన్న రోడ్డులో సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దీంతో ఇజార్పై దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రధాన నిందితుడు గ్యానిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం
గాలిస్తున్నట్లు వెల్లడించారు.