హైదరాబాద్ : ఔటర్ రింగ్ వద్ద తుపాకీ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. బెంజ్ కారు వచ్చిన యూఎస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఫైజల్ అహ్మద్ రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు ప్రత్నించాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని స్థానికులు రాయదుర్గంలోని కేర్ హస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఫైజల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఘటనా స్థలాన్ని డీసీపీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రింగ్ రోడ్డుపై తుపాకీతో కాల్చుకొని బెంజ్ కారు సీట్లో రక్తంతో ఉన్న ఫైజల్ ను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. ప్రాణంతో ఉన్నందున వెంటనే కేర్ హస్పిటల్ కి తరలించామని చెప్పారు. కారులో ఆయన ఒక్కరే ఉన్నారనీ.. సెల్ ఫోన్, తుపాకీని గుర్తించినట్టు తెలిపారు. మృతుడు మాసాబ్ ట్యాంక్ లో నివాసం ఉంటున్న సల్మాన్ అహ్మద్ అనే వ్యక్తి కుమారుడిగా గుర్తించామన్నారు డీసీపీ.