- ఐదేండ్ల కిందటే చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ పంపిన బహ్రెయిన్ ప్రభుత్వం
- డెడ్ బాడీని ఇండియాకు తీసుకెళ్లడం సాధ్యం కాదు
- అంత్యక్రియలకు రావాలని తెలిపిన బహ్రెయిన్ ఎంబసీ
కోరుట్ల,వెలుగు: ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన వ్యక్తి ఎన్నటికైనా తిరిగొస్తాడని కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. ఐదేండ్ల కింద మృతి చెందాడని మార్చురీలో డెడ్బాడీ ఉందని సమాచారం అందడం తో విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వె ళ్తే.. జగిత్యాల జిల్లా మెట్పల్లి టౌన్ రాంనగర్ కు చెందిన శ్రీపాద నరేశ్(40) కు 17 ఏండ్ల కింద కథలాపూర్ మండలానికి చెందిన లతతో పెండ్లి అయింది.
అనం తరం కొన్నాళ్లకు నరేశ్ ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లి 2010లో తిరిగొచ్చాడు. మళ్లీ కొన్ని నెలల అనంతరం వెళ్లాడు. 2018లో తన పాస్ పోర్టు గడు వు ముగుస్తుందని డబ్బులు పంపాలని కుటుంబ సభ్యులను కోరారు. అనంతరం నరేశ్ నుంచి ఎలాం టి సమాచారం అందలేదు. ఆరు నెలల కింద నరేశ్ ఆచూకీ కనిపెట్టాలని కుటుంబ సభ్యులు భారత రాయబార కార్యాలయ ఆఫీసర్లకు విన్నవించారు.
డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన బహ్రెయిన్
ఈనెల1న ఇండియన్ ఎంబసీకి డెత్ సర్టిఫికెట్ వచ్చింది. అందులో 2020 మే 28న బహ్రెయిన్ లోని సల్మానియా ఆస్పత్రిలో నరేశ్ మృతి చెందాడని , ఇందుకు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణమని పేర్కొంది. ఆస్పత్రిలోనే డెడ్ బాడీని ఉందని, పంపిం చే స్థితిలో లేదని నరేశ్ కుటుంబ సభ్యులు బహ్రెయిన్ కు రావాలని అందులో తెలిపింది. ఈనెల 30న తెలంగాణ ప్రభుత్వానికి ఈ – మెయిల్ పంపింది.
సీఎం ప్రవాసీ ప్రజావాణికి విన్నవించగా..
బహ్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారుల పేరుతో ఇటీవల ఒక పత్రికలో న్యూస్ పబ్లిష్ అయింది. దాంతో నరేశ్ మృతి విషయం తెలిసింది. దీంతో మృతుడు నరేశ్ సోదరుడు ధర్మపురి ఆనంద్ ఈనెల 21న హైదరాబాద్ లో ‘ సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. డెడ్ బాడీని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 28న హైదరాబాద్ లోని సీఎం ప్రజావాణి ఇన్చార్జ్ జి. చిన్నారెడ్డిని నరేశ్ కుటుంబసభ్యులు కలిసి డెడ్ బాడీ తరలింపు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. నరేశ్ అంత్యక్రియలకు అతని సోదరుడు ధర్మపురి ఆనంద్ హాజరు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రవాసీ సంఘాలు సాయం చేయాలని కోరుతున్నారు.
