- ఇన్స్టాలో టైం పాస్ లవ్ చాటింగ్
- వాయిస్ మెసేజ్లు సేకరించిన పోలీసులు
- మాజీ ఆర్మీ ఉద్యోగులతో వెపన్ ట్రైనింగ్
- 12 గంటల్లో 5 వెహికల్స్ మారిన అమృత్పాల్ సింగ్
చండీగఢ్ : ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్పాల్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అమృత్పాల్కు చాలా మంది అమ్మాయిలు, మహిళలతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో మహిళలతో చేసిన చాట్తో పాటు 12 వాయిస్ మెసేజ్లను పోలీసులు సేకరించారు. న్యూడ్ వీడియోలు రికార్డు చేసి వారిని బ్లాక్మెయిల్ చేసేవాడని తేలింది. అమ్మాయిలతో కేవలం నార్మల్ రిలేషన్షిప్ మాత్రమే కోరుకునేవాడు. సీరియస్గా ప్రేమించేవాడు కాదు. ఈ విషయాన్ని అమృత్ పాలే వాయిస్ మెసేజెస్లో చెప్పాడు. మహిళలకు కోపం ఎప్పుడూ ముక్కు మీదే ఉంటుందనేవాడు. కొంత మంది మహిళలతో అఫైర్స్ కూడా కొనసాగించాడు. ఇన్స్టాలో ఓ అమ్మాయితో తరుచూ మెసేజ్ చేసేవాడు. దుబాయ్లో హనీమూన్ చేసుకుందామని మెసేజ్ పంపిస్తే.. ఆ అమ్మాయి నవ్వుతూ ఎమోజీ పెట్టింది.
ఐఎస్ఐ కనుసన్నల్లో..
డ్రగ్స్ బానిసలు, ఆర్మీ నుంచి తొలగించబడిన మాజీ సైనికోద్యోగులతో పాటు యువతను అమృత్పాల్ టార్గెట్ చేసుకుని టెర్రరిస్ట్ గ్రూప్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేవాడని పంజాబ్ పోలీసులు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత పాకిస్తాన్కి చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆదేశాలతో అమృత్సర్లోని తన సొంతూరు జల్లుపూర్ కెహ్రాలో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ప్రారంభించాడు. చెడు ప్రవర్తన కారణంగా ఆర్మీ నుంచి తొలగించబడిన, రిటైర్డ్ సైనికుల కోసం సెర్చ్ చేసేవాడు. వీరితో యువతకు వెపన్ ట్రైనింగ్ ఇప్పించేవాడు. యాక్టర్ దీప్ సిద్ధూ చనిపోయాక ‘వారిస్ పంజాబ్ దే’ బాధ్యతలు చేపట్టాడు. అప్పుడు ఇద్దరిని సెక్యురిటీగా పెట్టుకున్నాడు. వీరి సంఖ్య ఈ ఏడాది ప్రారంభంలో 16కు పెంచుకున్నాడు. వీరిలో 8మంది యువకులే ఉన్నారు. వీరంతా డ్రగ్ డి అడిక్షన్ సెంటర్నుంచి వచ్చినవారే అని పోలీసులు తెలిపారు. సెంటర్లో ఉన్నప్పుడే వారికి అమృత్పాల్ ట్రైనింగ్ ఇచ్చాడు.
డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్లో యూత్ బ్రెయిన్ వాష్
డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్లో చేరిన వారికి అమృత్పాల్ బ్రెయిన్ వాష్ చేసి టెర్రరిస్ట్ గ్రూపులో రిక్రూట్ చేసుకునేవాడు. ఎక్స్ సర్వీస్మెన్స్కు గన్ లైసెన్స్ ఉండటంతో వారితో యువతకు శిక్షణ ఇప్పించేవాడు. తల్వీందర్ సింగ్, వారిందర్సింగ్ అనే ఇద్దరు మాజీ సైనికోద్యోగులు డ్రగ్స్ బానిసలకు వెపన్ ట్రైనింగ్లో కీలక పాత్ర పోషించారు. తల్వీందర్ సింగ్ పరారీలో ఉండగానే అతని గన్ లైసెన్స్ను అధికారులు రద్దు చేశారు. వారిందర్ సింగ్ పోలీసు కస్టడీలో ఉన్నాడు. డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ను ట్రైనింగ్ కోసం, గురుద్వారాను ఆయుధాలను దాచిపెట్టేందుకు ఉపయోగించుకునేవాడు. కొందరు సూసైడ్ బాంబర్స్ను కూడా అమృత్పాల్ సిద్ధం చేశాడు. ఆనంద్పూర్ ఖల్సా ఫౌజ్ (ఏకేఎఫ్) కోసం జల్లుపూర్ కెహ్రా గురుద్వారా, పలు డి అడిక్షన్ సెంటర్లలో దాచిపెట్టిన వెపన్స్, బాంబులు, యూనిఫాంలు, జాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి..
అమృత్పాల్ సింగ్ 12 గంటల్లో ఐదు వెహికల్స్మార్చాడు. ఆరు రోజులైన అతడి ఆచూకీ లభించలేదు. ఫస్ట్ బెంజ్ కారులో కనిపించిన సింగ్, తర్వాత షాకోట్లో బ్రెజాకు మారాడు. తర్వాత నంగల్ అంబియాన్ వద్ద బజాజ్ ప్లాటినా మోటార్ సైకిల్పై కనిపించాడు. బైక్లో పెట్రోల్ అయిపోవడంతో దాన్ని దారాపూర్లో డీజిల్తో నడిచే త్రీ వీలర్పై ఎక్కించాడు. తర్వాత అమృత్పాల్, పాపల్ ప్రీత్ కలిసి ఓ వ్యక్తి పాయింట్ బ్లాంక్లో పెట్టి హీరో స్ల్పెండర్ దొంగిలించారు. మార్చి 18న సాయంత్రం 6:46 గంటలకు లూథియానాలోని షేక్పూర్లో దొంగిలించిన బైక్పై వెళ్తూ సీసీ టీవీ ఫుటేజీకి చిక్కారు. వెహికల్ ఓనర్ ఫిర్యాదు మేరకు పంజాబ్ పోలీసులు స్ల్పెండర్ను స్వాధీనం చేసుకున్నారు.
కురుక్షేత్రలో మహిళ షెల్టర్
సోమవారం అమృత్పాల్ హర్యానా కురుక్షేత్రలోని ఓ ఇంటి నుంచి గొడుగు పట్టుకుని పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వైట్ షర్ట్, డార్క్ బ్లూ జీన్స్ వేసుకుని వెళ్తున్నట్లు అందులో క్లియర్గా కనిపిస్తున్నది. ఫేస్ కనిపించకుండా గొడుగు సాయం తీసుకున్నాడు. బల్జీత్ కౌర్ అనే మహిళ అమృత్పాల్తో పాటు పాపల్ప్రీత్కి షెల్టర్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అదేవిధంగా, అమృత్పాల్ ప్రైవేట్ సెక్యురిటీలో ఉండే తజిందర్ సింగ్ గిల్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లూథియానా జిల్లా ఖన్నా ఏరియాలోని మంగేవాల్ గ్రామానికి చెందిన గిల్, సోషల్ మీడియాలో వెపన్స్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెట్టేవాడని ఖన్నా డీఎస్పీ హర్సిమ్రత్ సింగ్ తెలిపారు.
