- విద్వేషం నుంచి దేశానికి స్వేచ్ఛ కల్పిస్తామని ప్రకటన
- ఇంకా 145 రోజులే మిగిలి ఉన్నాయంటూ క్యాప్షన్
- అది భారత్ తోడో, ఆగ్ లగావో యాత్ర: బీజేపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో పోస్ట్ చేసిన ఓ ఫొటో తీవ్ర దూమారాన్ని రేపింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు వేసుకునే నిక్కర్కు మంటలు అంటుకున్నట్టుగా ఉన్న ఫొటోను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దాని నుంచి పొగ వస్తున్నట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్లో ఈ ఫొటోను పోస్ట్ చేసింది. విద్వేషం నింపుతున్న వాతావరణం నుంచి దేశానికి స్వేచ్ఛనిచ్చేందుకు ఒక్కో అడుగు మందుకు వేస్తూ సాగుతున్నామని, ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశానికి చేసిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కోట్ చేసింది. ఇంకా 145 రోజులే మిగిలాయంటూ క్యాప్షన్ పెట్టింది. భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ పోస్ట్ చేసింది.
అది ఆగ్లగావో యాత్ర: బీజేపీ
కాంగ్రెస్ ఫొటోపై బీజేపీ మండిపడింది. అది భారత్ జోడో యాత్ర కాదని, భారత్ తోడో, ఆగ్ లగావో యాత్ర అని, కాంగ్రెస్ పార్టీకి ఇలాంటివి చేయడం కొత్త కాదని ఆరోపించింది. దేశంలో హింస చెలరేగాలని రాహుల్గాంధీ కోరుకుంటున్నారా? అని, కాంగ్రెస్ పార్టీ వెంటనే ఫొటోను తొలగించాలని బీజేపీ లీడర్ సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య కూడా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 1984లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి నిప్పు పెట్టిందని ఆరోపించారు. 2002లో కరసేవకుల్ని ఆ పార్టీ సానుభూతిపరులు గోద్రాలో నిప్పుపెట్టారని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ హింసను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వల్లే కాంగ్రెస్ పార్టీగా కొనసాగుతోందని చెప్పారు. మరోవైపు బీజేపీ ఓ అబద్ధాల ఫ్యాక్టరీ.. అది ఇప్పుడు ఓవర్టైం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఆరోపించారు. అధికార పార్టీ దూకుడు ప్రదర్శిస్తే.. తాము మరింత దూకుడు చూపిస్తామన్నారు.
రాహుల్ యాత్రకు మంచి స్పందన
కేరళలో రెండో రోజు రాహుల్ భారత్ జోడో యాత్రకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ‘‘దేశం, మన యువత మెరుగైన భవిష్యత్ కోసం ఎదురుచూస్తోంది. అదే నాలో ప్రతి ఉదయం ఆశ, విశ్వాసాన్ని నింపుతోంది. దేశం కోసం ప్రతి ఒక్కరూ, దేశం కోసం ప్రతి అడుగు”అని రాహుల్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. రాహుల్ను చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు చిన్నా పెద్దా అసక్తి చూపించారు. వేలాది మంది ఆయన కోసం ఎదురుచూశారు. సోమవారం వెల్లయాని జంక్షన్ నుంచి రాహుల్ పాదయాత్ర మొదలైంది.