పొలంలోకి దూసుకెళ్లిన స్కూల్​ బస్సు

పొలంలోకి దూసుకెళ్లిన స్కూల్​ బస్సు
  • బావి గట్టును ఆనుకొని ఆగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం
  • బస్సులో 45 మంది స్టూడెంట్లు.. 
  • అద్దాలు పగలగొట్టి బయటకు తీసిన స్థానిక యువకులు
  • సిద్దిపేట జిల్లా కోహెడ శివారులో ఘటన 

కోహెడ, వెలుగు : సిద్దిపేట జిల్లా కోహెడ శివారులో ఓ స్కూల్​ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. వ్యవసాయ బావి గట్టును ఆనుకొని ఆగిపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బెజ్జంకి మండలం రేగులపల్లిలోని సెయింట్​విన్సెంట్​పల్లోటి ప్రైవేట్​స్కూల్​కు చెందిన బస్సు సోమవారం మధ్యాహ్నం 45 మంది స్టూడెంట్స్​ను తీసుకొని కోహెడకు బయలుదేరింది. కోహెడ శివారులోకి వచ్చే సరికి ఎదురుగా లారీ వస్తుండడం, దానికి సమాంతరంగా టువీలర్ దూసుకురావడంతో డ్రైవర్​బస్సును పొలాల వైపు తిప్పాడు.

బస్సు స్పీడ్​గా ఉండడంతో కంట్రోల్​కాలేదు. పొలంలోకి దూసుకెళ్లి.. అక్కడ వ్యవసాయ బావి గట్టుకు ఆనుకుని ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. అటుగా వస్తున్న యువకులు రాజు, సతీశ్ పరుగున అక్కడికి చేరుకున్నారు. బస్సు మెయిన్​డోర్​వ్యవసాయ బావి వైపు ఉండడంతో మరోవైపు ఉన్న ఎమర్జెన్సీ డోర్​ను పగలగొట్టడానికి వారు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో రాడ్డుతో అద్దాలు పగలగొట్టి స్టూడెంట్స్​ను బయటకు తీసుకువచ్చారు.