అమెరికాలో రోడ్డు ప్రమాదం..39 మంది మృతి

అమెరికాలో  రోడ్డు ప్రమాదం..39 మంది మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 39 మంది మృతిచెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

అమెరికా కాలమానం ప్రకారం...బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కొలంబియా నుంచి డేరియన్​ లైన్​ను దాటి పనామాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఓ శిబిరానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 

బస్సు షెల్టర్‌ను దాటి ముందుకు వెళ్లడంతో దానిని మళ్లీ హైవేపైకి తీసుకురావడానికి డ్రైవర్‌ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అటుగా వస్తున్న మరో బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో అది లోయలో పడిపోయిందని పనామా అధ్యక్షుడు లారెన్షియో కార్టిజో వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 66 మంది ఉన్నారని తెలిపారు. 39 మంది మరణించగా, 20 మంది గాయపడ్డారని తెలిపారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. 

గతేడాది ఇదే మార్గం గుండా 2,48,000 వలసదారులు మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు తెలిపారు. వారిలో అత్యధికంగా వెనెజులాకు చెందినవారు ఉన్నారని తెలిపారు.