వాషింగ్టన్/బీజింగ్ (చైనా): అమెరికాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 కలవర పెడుతోంది. గత రెండు వారాల నుంచి ఈ వేరియంట్ వల్ల అమెరికాలో కేసులు పెరుగుతున్నాయని హెల్త్ నిపుణులు చెప్తున్నారు. బీఏ.2 వేరియంట్ ఈ ఏడాది జనవరి ప్రారంభంలోనే గుర్తించామని శాన్డియాగో జెనోమిక్స్ సంస్థ అయిన హెలిక్స్ చీఫ్ సైన్స్ ఆఫీసర్ విల్ లీ చెప్పారు. అయితే మొదట్లో ఆ వేరియంట్ చాలా నిదానంగా వ్యాపించిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల్లో 50 శాతం నుంచి 70 శాతం కేసులు ఈ వేరియంట్వేనని ఆయన అంచనా వేశారు. ఇది ఒమిక్రాన్ కంటే ప్రమాదకరం కాదని, అయితే రీఇన్ఫెక్షన్ సామర్థ్యం ఎలా ఉంటుందనే దానిపై ఆందోళన ఉందన్నారు. ఒకవైపు అమెరికాలో కేసులు తగ్గుతున్నా.. న్యూయార్క్లో మాత్రం బీఏ.2 వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) లెక్కలు చెబుతున్నాయి. దేశంలో వారం వారం ఈ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పింది. మార్చి 12 నాటికి బీఏ.2 వేరియంట్ కేసుల సంఖ్య 23.1 శాతానికి పైగా పెరిగిందని వెల్లడించింది.
చైనాలో మరో సిటీ లాక్డౌన్
చైనాలోని మరో సిటీలో లాక్డౌన్ విధించారు. అక్కడ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం దేశవ్యాప్తంగా 4,770 కొత్త కేసులు వచ్చాయని హెల్త్ అధికారులు చెప్పారు. దీంతో లియోనింగ్ ప్రావిన్స్లోని షెన్యాంగ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి లాక్డౌన్ విధించారు. షెన్యాంగ్లో మంగళవారం 47 కొత్త కేసులు రావడంతో, సిటీలో ఉన్న మొత్తం 90 లక్షల మందిని ఇండ్లకే పరిమితం చేశారు. 48 గంటల్లో అందరికీ టెస్టులు చేస్తామని, నెగెటివ్ వస్తేనే బయటకు వదులుతామని అధికారులు వెల్లడించారు.