వాషింగ్టన్ : వారం కిందట నిఘా బెలూన్.. తాజాగా గుర్తుతెలియని అనుమానాస్పద వాహనాన్ని అమెరికా సైన్యం కూల్చేసింది. అలస్కా ఉత్తర తీరంలో 40వేల ఫీట్ల ఎత్తులో ఎగురుతున్న వాహనాన్ని ఎఫ్22 యుద్ధ విమానం నుంచి ‘ఏఐఎం-9ఎక్స్’ మిస్సైల్ ప్రయోగించి నేలకూల్చింది. విమానాలు కనిష్టంగా 31వేల ఎత్తులో.. గరిష్టంగా 45వేల ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. ఈ వాహనం కూడా దాదాపు అదే ఎత్తులో కదులుతుండటాన్ని అమెరికా సైన్యం గుర్తించింది. అది అక్కడే ఉంటే.. ఆ రూట్ లో రాకపోకలు సాగించే విమానాలకు ముప్పు కలుగుతుందని భావించింది. వెంటనే రెండు యుద్ధ విమానాలను దాని దగ్గరికి పంపి.. అందులో ఎవరూ లేరని నిర్ధారించుకుంది. అనంతరం ఈ సమాచారాన్ని ప్రెసిడెంట్ జో బైడెన్కు అందించగా.. దానిని కూల్చేయాలని ఆయన ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో దాన్ని కూల్చేశారు. దీని గురించి వైట్ హౌస్ లో విలేకరులు బైడెన్ ను ప్రశ్నించగా.. ‘షూట్ డౌన్ సక్సెస్ ఫుల్’ అని కామెంట్ చేశారు. వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ, పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ ఈ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. అనుమానాస్పద వాహనాన్ని కూల్చేయడానికి ముందు.. శకలాలను సేకరించేందుకు దానికి సమీపంలోనే హెలికాప్టర్లు, ట్రాన్స్ పోర్ట్ విమానాల్లో అమెరికా ఉత్తర కమాండ్కు చెందిన సుశిక్షితులైన సైనికులను మోహరించామని తెలిపారు. అది కూలిన వెంటనే శకలాలను సేకరించే పనిని వారు మొదలుపెట్టారని చెప్పారు. అయితే ఈ వస్తువు ఎక్కడిది? ఎవరు ప్రయోగించారు? దాని లక్ష్యం ఏమిటి? అనేది ఇప్పటివరకు తెలియదు. ఈ పరిణామంపై చైనా ఘాటుగా స్పందించింది. ఇటువంటి ఘటనలను రాజకీయ మైలేజీ కోసం బైడెన్ బాగా వాడుకుంటున్నారని చైనా ప్రభుత్వం కామెంట్ చేసింది.
40 దేశాలపై బెలూన్లతో చైనా నిఘా..
ఫిబ్రవరి 4న సాయంత్రం దక్షిణ కరోలినా గగనతలంలో ఎగురుతున్న నిఘా బెలూన్ను అమెరికా సైన్యం కూల్చేసింది. దీంతో పాటు 40 దేశాలపై ఇలాంటి బెలూన్లతో చైనా నిఘా పెట్టిందని, ఆయా దేశాలను అలర్ట్ చేశామని వెల్లడించింది.