కిలాడీ లేడీ.. నాలుగు పెళ్లిల్లు.. డబ్బు, నగలతో పరార్  

కిలాడీ లేడీ.. నాలుగు పెళ్లిల్లు.. డబ్బు, నగలతో పరార్  

అప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకున్న ఓ  కిలాడీ లేడీ మరో యువకుడి పెళ్లి చేసుకుని డబ్బు, నగలతో పరారైంది. ఈ ఘటన రామగుండం ఎన్టీపీసీలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన అనూష అనే యువతితోఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన రేవంత్‌కు 7 నెలల కింద పెళ్లి అయింది.  రేవంత్‌కు  అప్పటికే పెళ్లి జరిగి విడాకులయ్యాయి. అయితే ఓ షాదీ డాట్‌ కామ్‌ ద్వారా వీరిద్దరికి పరిచయమైంది.  ఆ పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. 

రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు వీరికి ఎన్టీపీసీలోని చిలుకలయ్య ఆలయంలో పెళ్లి చేశారు. పెళ్లయ్యాక అనూష తన  కిలాడీల ప్రదర్శన ప్రారంభించింది. తనకు మందు సిగిరెట్లు కావాలంటూ రేవంత్ ను వేధింపులకు గురిచేసింది.  ఈ క్రమంలో ఇద్దరికి గొడవలు కూడా అయ్యాయి.  దీంతో అనూష తన అక్కవాళ్ల ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో ఉన్న రూ.70వేల డబ్బు, 4 తులాల బంగారు ఆభరణాలను తనతో పాటు తీసుకువెళ్లింది.  

రోజులు గడుస్తున్నా ఆమె  తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది. దీంతో రేవంత్ అనూష బంధువులు, మిత్రులను ఆరా తీస్తే..  అనూషకు సంబంధించిన  అసలు విషయాలు బయటపడ్డాయి.  అనూషకు గతంలోనే మూడు పెళ్లిల్లు అయ్యాయని, చాలామందితో పరిచయాలు ఉన్నాయని తెలిసింది. చివరకు ఆమె ఉంటున్న అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తే.. అక్కడ రేవంత్ పై తన స్నేహితులతో దాడి చేసి దానంతా వీడియో తీసింది అనూష.

అంతేకాకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగింది.  ఈ క్రమంలో రేవంత్ ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యవతి కోసం గాలిస్తున్నారు.