
లక్సెట్టిపేట, వెలుగు : తల్లిదండ్రులు తనకు బైక్ కొనివ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఆదివారం వెలుగుచూసింది. ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని క్లబ్ రోడ్డు లంబాడీతండాకు చెందిన రాథోడ్ మణికంఠ (20) మంచిర్యాలలోని ఐటీఐలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తనకు బైక్ కొనివ్వాలని కొన్ని రోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. బైక్ విషయాన్ని శనివారం మరోసారి అడగడంతో తర్వాత కొనిస్తామని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠ గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు గమనించగా... అప్పటికే చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.