మరిపెడ, వెలుగు : ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఎల్లంపేట శివారు లక్ష్మాతండాకు చెందిన మాలోతు రమ్య (19), బొట్యా తండాకు చెందిన ధరంసోత్ సుమన్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
పెండ్లి చేసుకుందామని రమ్య కోరడంతో సుమన్ కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే తాను వేరే అమ్మాయిని పెండ్లి చేసుకుంటానని సుమన్ చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన రమ్య ఈ నెల 22న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు.
అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ మంగళవారం చనిపోయింది. మరణానికి ముందు.. సుమన్ తనను మోసం చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రమ్య పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
