‘ఆదిపురుష్’....కాంట్రవర్సీల కంటే కలెక్షన్సే ఎక్కువ

‘ఆదిపురుష్’....కాంట్రవర్సీల కంటే కలెక్షన్సే ఎక్కువ

ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్‌‌‌‌ తెరకెక్కించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి లభిస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు ‘రామ జయం, రఘురామ జయం’ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ ‘ఆదివారం వరకూ ఈ చిత్రాన్ని కోటి మంది ప్రేక్షకులు చూశారు. రామనామాన్ని ప్రతి గడపకు చేర్చాలనే మా ప్రయత్నంలో సక్సెస్ అయ్యాం. ట్రోల్ చేసేవాళ్లు కూడా పరోక్షంగా రాముడిని తలుచుకుంటున్నారు. ఎన్ని కాంట్రవర్సీలు వస్తున్నాయో అంతకంటే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. 

ఈతరం  పిల్లలకు హాలీవుడ్ సూపర్ హీరోస్ మాత్రమే తెలుసు. కానీ మన  జాంబవంతుడు, అంగదుడు వంటి పౌరాణిక వీరుల గురించి ‘ఆదిపురుష్‌‌‌‌’ ద్వారా పిల్లలు  తెలుసుకుంటున్నారు’ అన్నారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘చిత్ర విజయంలో నా పాటలు భాగమవడం సంతోషంగా ఉంది. ఈతరం వారికి రామకథను చెప్పాలనే గొప్ప సంకల్పంతో దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎంతో ఎమోషన్‌‌‌‌తో ఆయన దీన్ని తెరకెక్కించారు’ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత విక్రమ్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, మాటల రచయిత శ్రీనివాస్ పాల్గొన్నారు.