కొల్లాపూర్, వెలుగు : తమకు నెలకు రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల ఆశా వర్కర్లు గురువారం కొల్లాపూర్లోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో మండుటెండలో నిరసన తెలిపిన ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ తమకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, విధి నిర్వహణలో మరణిస్తే అంత్యక్రియల ఖర్చుతో పాటు బీమా చేయించాలని డిమాండ్ చేశారు.
అనంతరం తమ వినతిపత్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావుకు అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఆశా వర్కర్ల సమస్యలను కేబినెట్లో చర్చించడంతో పాటు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల యూనియన్ నాయకురాలు గౌరమ్మ, శివలీల, శ్రీదేవి, చెన్నమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
