వెలుగు బిజినెస్ డెస్క్: రోడ్డు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను మూడు నెలల్లోనే పరిష్కరించేలా చొరవ తీసుకుంటున్నారు. కేంద్ర రోడ్ల మంత్రిత్వ శాఖ, ఇన్సూరెన్స్ కంపెనీలు, రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్లు కలిసి ఒక ప్లాన్ను ఇందుకోసం తేనున్నాయి. మన దేశంలో రోడ్లపై యాక్సిడెంట్ల పాలయిన వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అందడానికి సగటున అయిదేళ్లు పడుతోందని, దీనిని ఇప్పుడు మూడు నెలలకి తగ్గించేలా చొరవ తీసుకుంటున్నారని సీనియర్ అధికారులు వెల్లడించారు. కొన్ని కేసులు 20 ఏళ్లుగా కోర్టులలో నడుస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రత్యేక పోర్టల్, ఫార్ములా...
సుప్రీం కోర్టు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (ఎంఏసీటీ), హైకోర్టులు క్లెయిమ్లు తొందరగా సెటిలయ్యే విధంగా ఒక ఫార్ములాను డెవలప్ చేస్తున్నాయని ఆ అధికారులు చెప్పారు. దీంతో యాక్సిడెంట్కు గురయిన బాధితులు లేదా వారి కుటుంబాలకు వెంటనే రిలీఫ్ దొరుకుతుందని పేర్కొన్నారు. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో లిటిగేషన్ తగ్గించాలనేదే ఈ మార్పు లక్ష్యం. ఇందుకోసం ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి బాధితులు క్లెయిమ్లు పొందే ప్రక్రియనూ సులభం చేయనున్నారు. రోడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను వేగంగా పరిష్కరించడం కోసం జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (జీఐసీ) ఒక వెబ్సైట్ను డెవలప్ చేస్తోంది. జరిగిన యాక్సిడెంట్లను ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్లో రియల్ టైములో అప్లోడ్ చేయనున్నారు. పోలీసులు లేదా బాధితులు (వారి కుటుంబం) యాక్సిడెంట్ గురించి ఈ పోర్టల్కు తెలియచేయాల్సి ఉంటుంది. 24 గంటలూ పనిచేసే ఇన్సూరెన్స్ కంపెనీ ఫోన్ నెంబర్కు కూడా ఫోన్ చేసి యాక్సిడెంట్ వివరాలు తెలియచేయాలి.
ఎంఏసీటీ ఈమెయిల్ అప్లికేషన్లు తీసుకోవాలి...
యాక్సిడెంట్ రిపోర్టును జరిగిన 48 గంటలలోపు ఎలక్ట్రానిక్ రిపోర్టు రూపంలో జీఐసీ, ఎంఏసీటీలకు తెలియ చేయాలని పోలీసులను సుప్రీం కోర్టు ఈ ఏడాది మార్చి 15 న ఆదేశించింది. యాక్సిడెంట్ ఏ కారణం వల్ల జరిగిందనే వివరాలు ఆ రిపోర్టులో ఉండాలని పేర్కొంది. ఈ నిబంధనను అందరూ పాటించాలని సుప్రీం కోర్టు సూచించగా, ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయి. నెల రోజుల లోపు పోలీసులు యాక్సిడెంట్పై డిటెయిల్డ్ రిపోర్టును సబ్మిట్ చేయాలి. అప్లికేషన్లను, రిపోర్టులను ఎంఏసీటీ ఈమెయిల్ రూపంలో తీసుకోవాలని కూడా కోర్టు సూచించింది. ఆ తర్వాత ఈమెయిల్స్ ద్వారానే సమన్లను పంపి, వీడియో కాన్ఫరెన్సింగ్ ఎంఏసీటీ హియరింగ్ (విచారణ) నిర్వహించాలి. నెల రోజులలోపే ఈ విచారణను ఎంఏసీటీ పూర్తి చేయాలి. అనంతరం ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ డబ్బును బాధితులు లేదా వారి కుటుంబాలకు ఎలక్ట్రానికల్గా పంపాల్సి ఉంటుందని పై సీనియర్ అధికారులు పేర్కొన్నారు. కాంపెన్సేషన్ ఎంతనేది నిర్ణయించడానికి స్పెసిఫిక్ ఫార్ములా కూడా డెవలప్ చేస్తున్నారని వెల్లడించారు.
ఏటా 5 లక్షల యాక్సిడెంట్లు..
దేశంలో ఏటా 5 లక్షల మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ రిపోర్టవుతుంటే, అందులో 1.5 లక్షల కేసులో బాధితులు మరణిస్తున్నారు. మిగిలిన కేసులలో బాధితులు తీవ్రమైన గాయాలపాలవుతున్నారని అధికారులు చెప్పారు. యాక్సిడెంట్ బాధితులకు ఇన్సూరెన్స్ పాలసీ లేకపోయినా వెహికల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాంపెన్సేషన్ పొందొచ్చనే విషయం దేశంలో చాలా మందికి తెలియనే తెలియదని కూడా ఆ అధికారులు పేర్కొన్నారు.
రూ.12 వేల కోట్ల క్లెయిమ్స్..
దేశంలో ప్రతీ ఏడాది కనీసం రూ. 10 నుంచి రూ. 12 వేల కోట్ల విలువైన రోడ్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ వస్తున్నాయి. ఇందులో సగటున రూ. 5 వేల కోట్ల విలువైన క్లెయిమ్స్ను ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తున్నాయి. మిగిలిన క్లెయిమ్స్ ఏదో ఒక రకమైన వివాదంతో కోర్టులలో ఏళ్ల తరబడి నలుగుతున్నాయి. ఫలితంగా యాక్సిడెంట్ బాధితులు లేదా వారి కుటుంబాలకు ఇబ్బందులెదురవుతున్నాయని సీనియర్ అధికారులు పేర్కొన్నారు. రోడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నిజానికి నెల రోజులలోపు సెటిలవ్వాలి. కానీ, ప్రస్తుతం 5 నుంచి 10 ఏళ్లు కూడా పడుతోంది. బాధితులకు లేదా వారి కుటుంబాలకు అంగీకారమైన సెటిల్మెంట్ తొందరగా చేయాల్సిన అవసరం వుందని ఆ అధికారులు వివరించారు.