మహబూబాబాద్ అర్బన్, వెలుగు : ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు కింద నుంచి వెళ్తూ కానిస్టేబుల్మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నర్సింహుల పేట పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ హరిప్రసాద్(32), అటాచ్ లో భాగంగా ప్రస్తుతం తొర్రూర్ సర్కిల్ ఆఫీసులో డ్యూటీ చేస్తున్నాడు. అతడు శుక్రవారం రాత్రి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటి అవతలి వైపు వెళ్లేందుకు ఆగిన గూడ్స్ రైలు కింద నుంచి వెళ్తున్నాడు. అదే సమయంలో గూడ్స్ రైలు కదలడంతో దాని చక్రాల కింద నలిగి చనిపోయాడు.
అతని వద్ద ఎలాంటి ఐడీ కార్డు లేకపోవడంతో డెడ్ బాడీని జీఆర్పీ పోలీసులు జిల్లా జనరల్ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డు దేవేందర్ గుర్తించి గూడూరు ఏఎస్ఐ బిచ్చానాయక్ కు సమాచారం అందించారు. మృతుడి ఫొటోలను చూసి నర్సింహులపేట పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ హరిప్రసాద్ గా గుర్తించారు. అతని సొంతూరు నెక్కొండ మండలం. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
