కోల్ ఇండియా దగ్గర ఉన్న బొగ్గు నిల్వ ఎంత.?

కోల్ ఇండియా దగ్గర ఉన్న బొగ్గు నిల్వ  ఎంత.?

దేశ వ్యాప్తంగా ఉన్న థర్మల్‌‌ పవర్‌‌‌‌ స్టేషన్లలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. సరఫరా చేయడానికి సరిపడా బొగ్గు ‘కోల్‌‌ ఇండియా’ దగ్గర ఉందా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌ కావాల్సినంత బొగ్గు ఉందంటోంది. కానీ.. థర్మల్ పవర్‌‌‌‌ స్టేషన్లలో మాత్రం  కొన్ని రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. ఈ మధ్యే బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘‘కోల్ ఇండియా దగ్గర ప్రస్తుతం 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. సరఫరా కూడా పెరుగుతుంది. అవసరానికి అనుగుణంగా బొగ్గు అందుబాటులో ఉంటుంది” అని అన్నారాయన.

  •  ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితిని పర్సనల్‌‌గా మానిటర్‌‌‌‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కరెంట్ సమస్యకు లాంగ్‌‌ టర్మ్‌‌ సొల్యూషన్స్‌‌ కోసం, బొగ్గు సప్లై పెంచేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతోపాటు పవర్‌‌‌‌ సెక్టార్‌‌‌‌లో పబ్లిక్‌‌, ప్రైవేట్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌తో ఇన్వెస్ట్‌‌మెంట్లు పెట్టే అవకాశం కూడా ఉంది.  
  • గవర్నమెంట్ డేటా ప్రకారం.. థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు స్టాక్ సరిగ్గా లేదు. దేశంలో 135 సెంట్రల్లీ మానిటర్డ్ పవర్‌‌‌‌ స్టేషన్లు ఉంటే.. వాటిలో 115 ప్లాంట్లు క్రిటికల్‌‌ లేదా సూపర్ క్రిటికల్ క్రైసిస్‌‌ను ఎదుర్కొంటున్నాయి. 70 పవర్ ప్లాంట్లలో నాలుగు రోజులకు సరిపడే కంటే తక్కువ బొగ్గు ఉంది.
  • పెరిగిన కరెంట్‌‌ డిమాండ్‌‌ను తీర్చడానికి దేశీయ గ్రేడ్‌‌తో బొగ్గు దిగుమతులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కరెంట్‌‌ ప్రొడ్యూసర్స్‌‌కు అనుమతులు ఇచ్చింది. కోల్ ఇండియా సరఫరా చేయలేకపోతే బొగ్గు దిగుమతులపై గవర్నమెంట్‌‌ అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు వస్తాయని తెలుస్తోంది. 
  • కొన్ని రాష్ట్రాలు వినియోగదారులకు కరెంట్‌‌ సరఫరా చేయడానికి బదులుగా రోలింగ్ కరెంట్ కోతలు పెడుతున్నాయి. ఈ పద్ధతినే ‘‘లోడ్-షెడ్డింగ్” అంటారు. పవర్ ఎక్స్ఛేంజీలకు ఎక్కువ ధరకు కరెంట్‌‌ను అమ్ముకుంటున్నాయని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 
  • రాష్ట్రాలు తమ కస్టమర్లకు సర్వీసులు అందించకున్నా, పవర్ ఎక్స్ఛేంజీలలో కరెంట్‌‌ను అమ్ముకున్నా ఆ రాష్ట్రాలకు కేటాయించే పవర్‌‌‌‌ను ఇతర అవసరమైన రాష్ట్రాలకు కేటాయిస్తామని గవర్నమెంట్‌‌ ప్రకటించింది. 
  • వీకెండ్‌‌ పవర్‌‌‌‌ కట్స్‌‌ వల్ల కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడులు కరెంట్‌‌ సంక్షోభం గురించి కేంద్రానికి వినతులు పంపాయి. దాంతో హోం మంత్రి అమిత్‌‌షా బొగ్గు, పవర్‌‌‌‌ మంత్రిత్వ శాఖల మంత్రులు ప్రహ్లాద్ జోషి, ఆర్కే సింగ్‌‌తో సమావేశమయ్యారు.

అప్పుడు వద్దన్నాయి

  • గతంలో సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌ బొగ్గు నిల్వలను పెంచుకోవాలని చెప్పినా రాష్ట్రాలు వినలేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. పండుగ సీజన్ వల్ల దేశంలోని చాలా పవర్‌‌‌‌ ప్లాంట్లు బొగ్గు కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. దాంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిస్థితికి సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌ కారణమని ఆరోపించడంతో ఆయన ఇలా గతాన్ని గుర్తుaచేశారు. ఈ సంవత్సరం జూన్ వరకు స్టాక్ పెంచుకోవాలని రిక్వెస్ట్‌‌ చేసినా రాష్ట్రాలు పట్టించుకోలేదు. పైగా ‘‘దయచేసి బొగ్గు పంపించొద్దు” అని చెప్పాయన్నారు. అక్టోబర్‌‌‌‌ 11న దేశంలో ఎన్నడూ లేనంతగా 1.94 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసిందని చెప్పారు. అయితే.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్లాంట్లకు 15–20 రోజుల వరకు ఈ కొరత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దేశీయ బొగ్గు సరఫరాపై ఆ ప్రభావం బాగా పడుతోంది. 

::: సగన్​