- డ్రైవర్ శ్రీనివాస్తో కలిసి హాజరు
- 13న నవదీప్ను విచారించనున్న ఈడీ
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ కేసులో హీరో రవితేజ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. తన డ్రైవర్ శ్రీనివాస్రావుతో కలిసి ఉదయం10:30 గంటలకు బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసుకు వచ్చారు. బ్యాంక్ స్టేట్మెంట్లను అధికారులకు అందజేశారు. ఈ కేసులో కెల్విన్, జిషాన్ ఇద్దరూ నిందితులుగా ఉన్నారు. శ్రీనివాస్ కు జిషాన్ తో కాంటాక్ట్స్ ఉన్నాయని, జిషాన్ కు కెల్విన్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయని సిట్ తన రిపోర్టులో పేర్కొంది. దీని ఆధారంగా ఈడీ వీరిని విచారించింది. ఈ క్రమంలో మధ్యాహ్నం జిషాన్ అలీఖాన్ ను కూడా ఈడీ అధికారులు పిలిపించారు. ముగ్గురిని విడివిడిగా విచారించి స్టేట్ మెంట్లు రికార్డు చేశారు. ముగ్గురి బ్యాంక్ ట్రాన్సాక్షన్లను పరిశీలించారు. కెల్విన్ అరెస్టుకు ముందు జరిగిన మనీ ట్రాన్స్ఫర్లపై వివరాలు సేకరించారు. మూడు అనుమానాస్పద అకౌంట్స్ గురించి ప్రశ్నించారు. జిషాన్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్ ఆధారంగా శ్రీనివాస్ ను ఈడీ విచారించింది. 2017 జూన్లో జిషాన్ తో కాంటాక్ట్స్ గురించి ఆరా తీసింది. అయితే కెల్విన్, జిషాన్ ఎవరో తనకు తెలియదని విచారణలో రవితేజ చెప్పినట్లు సమాచారం. రవితేజ ఓ ఫిల్మ్ స్టార్గా తెలుసు తప్ప, తనకు ఎలాంటి పరిచయం లేదని జిషాన్ చెప్పినట్లు తెలిసింది. కాగా, ఈనెల 13న హీరో నవదీప్ను విచారించేందుకు ఈడీ రెడీ అయ్యింది.
ఇద్దరూ ఈవెంట్ మేనేజర్లే..
కెల్విన్, జిషాన్ ఇద్దరూ ఈవెంట్ మేనేజర్లుగా పని చేశారు. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకున్నారు. షూటింగ్స్, ఈవెంట్స్ టైమ్ లో డ్రగ్స్ సప్లయ్ చేసేవారు. డ్రైవర్ శ్రీనివాస్తో ఉన్న పరిచయంతోనే ఎఫ్ క్లబ్లో జరిగిన పార్టీలకు కెల్విన్ గ్యాంగ్ హాజరైనట్లు ఈడీ అనుమానిస్తోంది. పబ్స్ లో జరిగిన పార్టీలు, షూటింగ్స్ సమయాల్లో జిషాన్, శ్రీనివాస్ల మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు ఈడీ గుర్తించిందని తెలిసింది. జిషాన్ అకౌంట్స్ నుంచి కెల్విన్కి భారీగా మనీ ట్రాన్స్ఫర్లు జరిగినట్లు ఆధారాలు సేకరించింది.