అదానీ ఆడిటర్లపై ఎన్​ఎఫ్​ఆర్​ఏ ఎంక్వయిరీ

అదానీ ఆడిటర్లపై ఎన్​ఎఫ్​ఆర్​ఏ ఎంక్వయిరీ

న్యూఢిల్లీ: అదానీ ఆడిటర్లలో ఒకరైన ఎస్​ ఆర్​ బాట్లిబాయ్​పై నేషనల్​ ఫైనాన్షియల్​ రిపోర్టింగ్​ అథారిటీ (ఎన్​ఎఫ్​ఆర్​ఏ) ఎంక్వయిరీ మొదలుపెట్టింది. చాలా కాలంగా బాట్లిబాయ్​ అదానీ గ్రూప్​కు ఆడిటర్​గా కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గౌతమ్​ అదానీ  నాయకత్వంలోని  కొన్ని  గ్రూప్​  కంపెనీతో 2014 నుంచీ  నిర్వహించిన సంభాషణల వివరాలను తెలియచేయాలని ఎస్​ఆర్​ బాట్లిబాయ్​ను ఎన్ఎఫ్ఆర్ఏ  కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఎస్​ఆర్​ బాట్లిబాయ్​ ఈవై ఇండియా మెంబర్​గా వ్యవహరిస్తోంది. ఈ ఎంక్వయిరీకి ఎంత టైము పడుతుందనేది ఇంకా తెలియలేదు. అలాగే, ఆ తర్వాత ఆడిటర్, అదానీ కంపెనీలపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేదీ స్పష్టం కాలేదు. ఎన్​ఎఫ్​ఆర్​ఏ, అదానీ గ్రూప్​ కంపెనీల ప్రతినిధులు ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు బదులివ్వలేదు. 

ఈవై, ఎస్​ ఆర్​ బాట్లిబాయ్​సంస్థల ప్రతినిధులు సమాధానం ఇవ్వడానికి తిరస్కరించారు. అదానీ గ్రూప్  ​రెవెన్యూలో సగ భాగం తెచ్చే అయిదు లిస్టెడ్​ కంపెనీలకు ఎస్​ ఆర్​ బాట్లిబాయ్ సంస్థ ఆడిటర్​గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యూఎస్​ షార్ట్​ సెల్లర్​ హిండెన్​బర్గ్​ ఈ ఏడాది జనవరి నెలలో అదానీ గ్రూప్​పై  చేసిన ఆరోపణల నేపథ్యంలో తాజా  ఎన్​ఎఫ్ఆర్​ఏ ఎంక్వయిరీ ప్రాధాన్యం సంతరించుకుంది. హిండెన్​బర్గ్​ ఆరోపణలన్నీ అబద్దాలని, ఉద్దేశపూర్వకంగా చేసినవేనని జనవరి నుంచీ అనేకసార్లు అదానీ గ్రూప్​ వాటిని తిప్పి కొట్టే ప్రయత్నాలు చేస్తోంది.