అదానీ ఎంటర్​ప్రైజస్​ లాభం జూమ్

అదానీ ఎంటర్​ప్రైజస్​ లాభం జూమ్

న్యూఢిల్లీ : అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ లాభం జూన్​ 2023 క్వార్టర్లో 44.41 శాతం పెరిగి రూ. 674 కోట్లకు చేరింది. తాజా క్వార్టర్లో ఖర్చులు బాగా తగ్గడం వల్లే లాభం పెరిగింది. అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో కంపెనీ లాభం రూ. 469 కోట్లు మాత్రమే. కాకపోతే, జూన్​ 2023 క్వార్టర్లో అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ రెవెన్యూ భారీగా తగ్గడం గమనించదగ్గది. 

అంతకు ముందు ఏడాది జూన్​ క్వార్టర్లో రూ. 41,066 కోట్లుగా ఉన్న రెవెన్యూ తాజా జూన్​ క్వార్టర్లో రూ. 25,809 కోట్లకు పడిపోయింది. ఆపరేషనల్​గా, ఫైనాన్షియల్​గా గ్రూప్​ పటిష్టతను అదానీ ఎంటర్​ప్రైజస్​ రిజల్ట్స్​ ప్రతిఫలిస్తాయని కంపెనీ చైర్మన్​ గౌతమ్​ అదానీ చెప్పారు. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ రంగంలో అదానీ జర్నీ అద్భుతంగా సాగుతోందని, ఇదే ట్రెండ్​ కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదానీ గ్రూప్​లో ప్రధానమైన కంపెనీగా అదానీ ఎంటర్​ప్రైజస్​ వెలుగొందుతున్న విషయం తెలిసిందే. చెన్నై ఫేజ్​2 డేటా సెంటర్​ ప్రాజెక్టులో 74 శాతం, నోయిడా డేటా సెంటర్​ ప్రాజెక్టులో 51 శాతం, హైదరాబాద్​ డేటా సెంటర్​ ప్రాజెక్టులో 46 శాతం పనులను అదానీ కానెక్స్​(గ్రూప్​ కంపెనీ) పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్​ వెల్లడించింది.

అదానీ గ్రూప్​ చేతికి సంఘి ఇండస్ట్రీస్​

సంఘి ఇండస్ట్రీస్​లో అదానీ గ్రూప్​లోని అంబుజా సిమెంట్స్​ మెజారిటీ వాటా దక్కించుకుంటోంది.  ఇండియా పశ్చిమ ప్రాంతంలో సంఘి ఇండస్ట్రీస్​ పెద్ద సిమెంట్​ తయారీదారుగా పేరు పొందింది. సంఘి  ఇండస్ట్రీస్​  ఎంటర్​ప్రైజ్​ వాల్యూను రూ. 5 వేల కోట్లుగా లెక్కకట్టారు. డీల్​ కింద సంఘి ఇండస్ట్రీస్​లో అంబుజా సిమెంట్స్​ 56.74 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్లు రవి సంఘి, ఆయన ఫ్యామిలీ నుంచి  చేజిక్కించుకుంటుంది. 

గుజరాత్​లోని కచ్​ జిల్లాలో సంఘి ఇండస్ట్రీస్ క్లింకర్​​ యూనిట్​కు ఏడాదికి 6.6 మిలియన్​ టన్నుల ప్రొడక్షన్​ కెపాసిటీ ఉంది. ఇక 6.1 మిలియన్​ టన్నుల సిమెంట్​ తయారీ కెపాసిటీ ఈ కంపెనీ సొంతం. సంఘిపురం వద్ద సంఘి ఇండస్ట్రీస్​కి ఉన్న క్యాప్టివ్​ జెట్టీ కెపాసిటీని పెంచాలని అదానీ గ్రూప్​ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.