ముంబై: అదానీ గ్రూప్ మార్చి క్వార్టర్లో మూడు బిలియన్ డాలర్ల అప్పులను తిరిగి చెల్లించి ప్రమోటర్ తనఖాలను తగ్గించుకుంది. మూడు దేశీయ మ్యూచువల్ ఫండ్లకు బకాయిలను చెల్లించింది. జీక్యూజీ పార్ట్నర్స్అందించిన 1.88 బిలియన్ డాలర్ల ఈక్విటీ ఫండింగ్, ప్రమోటర్ -గ్రూప్ ఫండింగ్ నుంచి అదనంగా వచ్చిన బిలియన్ డాలర్లతో అప్పులు కట్టింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్, అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి తొమ్మిది లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలలో నాలుగింటిలో ప్రమోటర్ల తనఖాలను తగ్గించడానికి ఈ గ్రూప్ కనీసం 2.54 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని గత వారం రెగ్యులేటరీ ఫైలింగ్స్ద్వారా తెలిసింది.
ఇంటర్నల్ నోట్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ గ్రూప్ కమర్షియల్ పేపర్ల (సీపీలు) ద్వారా తీసుకున్న రూ.3,650 కోట్ల విలువైన అప్పులను తిరిగి చెల్లించింది. వీటిని గతంలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ (రూ.2,750 కోట్లు), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ (రూ.500 కోట్లు), హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ (రూ.450 కోట్లు) నుంచి తీసుకుందని సంస్థ వర్గాలు తెలిపాయి.