బిజినెస్ డెస్క్, వెలుగు: ఇంకో వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది బిజినెస్ వరల్డ్ను అనేక అంశాలు ప్రభావితం చేశాయి. వీటి దెబ్బకు మార్కెట్లు కుప్పకూలాయి. కొంత మంది ప్రముఖలు చేసిన కామెంట్స్ మొత్తం ఇంటర్నెట్ను కుదిపేశాయి. ఈ ఏడాది జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తు చేసుకుందాం.
1. అదానీ- హిండెన్బర్గ్ ఇష్యూ..
ఈ ఏడాది ప్రారంభంలో అదానీ – హిండెన్బర్గ్ ఇష్యూ స్టార్టయ్యింది. అమెరికాకు చెందిన ఈ రీసెర్చ్ కంపెనీ అదానీ గ్రూప్పై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రమోటర్లు తమ కంపెనీ షేర్లను మానిప్యూలేట్ చేశారని, అందుకే అదానీ గ్రూప్ షేర్లు రికార్డ్ లెవెల్లో ట్రేడవుతున్నాయని పేర్కొంది. కొన్ని దశాబ్దాలుగా అకౌంటింగ్ ఫ్రాడ్స్కు పాల్పడిందని ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఓ రిపోర్ట్ను జనవరి 24 న బయటపెట్టింది. ఈ రిపోర్ట్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని, 2004 – 2015 మధ్య జరిగిన చాలా అంశాలను తప్పుగా చూపించి, తీవ్ర ఆరోపణలు చేసిందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఘాటుగా సమాధానమిచ్చారు కూడా.
తమ పరువు తీయడానికే హిండెన్బర్గ్ ఈ తప్పుడు ఆరోపణలు చేసిందని అన్నారు. అయినప్పటికీ కంపెనీ షేర్ల పతనం ఆగలేదు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు 80 శాతం వరకు పడ్డాయి. ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడిగా కొనసాగిన గౌతమ్ అదానీ 30 స్థానానికి పడిపోయారు. ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవడంతో ఈ ఇష్యూ సుప్రీం కోర్టుకి వెళ్లింది. అదానీపై ఉన్న ప్రేమతోనే బీజేపీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఎక్స్పర్ట్ ప్యానెల్ను నియమించింది. దీంతోపాటు సెబీని ఈ ఇష్యూపై దర్యాప్తు చేయమని చెప్పింది. తాజాగా సెబీ సుప్రీం కోర్టులో తన రిపోర్ట్ను సబ్మిట్ చేయగా, తీర్పు రావాల్సి ఉంది.
2. మార్కెట్లు జూమ్..
ఈ ఏడాది బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ జీవిత కాల గరిష్టాలకు చేరుకున్నాయి. ఈ నెల 20 న సెన్సెక్స్ 71,913 లెవెల్ను, నిఫ్టీ 21,593 లెవెల్ను టచ్ చేశాయి. ‘ ఏడాది ప్రారంభంలో ఎకానమీలో అనిశ్చితి కొనసాగింది. సప్లయ్ సమస్యలు, వాల్యుయేషన్ ఎక్కువగా ఉండడం, యూఎస్ స్మాల్ బ్యాంక్స్ దివాలా తీయడం, వడ్డీ రేట్లు గరిష్టాల్లోకి చేరుకోవడంతో మార్కెట్ కొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తుందని ఎవరూ అనుకోలేదు. గ్లోబల్ ఎకానమీ మందగించడంతో పాటు జియోపొలిటికల్ టెన్షన్ల కారణంగా కంపెనీల లాభాలు కూడా తగ్గాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
ఈ పరిస్థితులు చివరి ఆరు నెలల్లో మారాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తామని ప్రకటించింది. సప్లయ్ చెయిన్ సమస్యలు తగ్గాయి. దేశ జీడీపీ గ్రోత్ అంచనాలను ఫారిన్ కంపెనీలు పెంచడం మొదలు పెట్టాయి. దేశ ఎకానమీ స్ట్రాంగ్గా ఉండడంతో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మార్కెట్లో డబ్బులు పెట్టడం మొదలుపెట్టారు. డిసెంబర్ నాటికి బెంచ్మార్క్ ఇండెక్స్లు కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి.
3. ఎక్స్గా ట్విటర్
గ్లోబల్గా జరిగిన ముఖ్యమైన అంశాల్లో ట్విటర్ ఇష్యూ ముందుంటుంది. కిందటేడాది ఈ సోషల్ మీడియా కంపెనీని కొనుగోలు చేసిన టెస్లా బాస్ ఎలన్ మస్క్ ఈ ఏడాది దీని పేరును ఎక్స్గా మార్చేశారు. ఐకానిక్ బర్డ్ సింబల్ను తొలగించారు. ట్విటర్ బ్రాండ్ను కంపెనీ వెబ్సైట్లు, యాప్లు, హెడ్క్వార్టర్ నుంచి కూడా తీసేశారు.
4. 70 గంటలు పనిచేయాలి
ఐటీ దిగ్గజం ఎన్ఆర్ నారాయణ మూర్తి సోషల్ మీడియాలో పెద్ద డిబేట్కు తెరలేపారు. దేశ ఎకానమీ అభివృద్ధి చెందాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఈ ఏడాది అక్టోబర్లో ఓ పాడ్కాస్ట్లో ఆయన పేర్కొన్నారు. టెక్ మహీంద్రా మాజి సీఈఓ సీపీ గుర్నాని, మారికో చైర్మన్ హర్ష్ మరివాలా, ఓలా సీఈఓ భవీశ్ అగర్వాల్, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధిక గుప్తా, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ వంటి ఎంటర్ప్రెనూర్లు తమ వ్యూస్ను పంచుకున్నారు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు మాత్రం టాప్ పొజిషన్లలో ఉన్నోళ్లు ఉద్యోగుల రక్తం తాగుతున్నారని కోప్పడ్డారు.
5. ఫైనాన్షియల్ సెక్టార్పై రిలయన్స్ కన్ను
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి కొత్త కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వేరయ్యింది. ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ షేర్లు మార్కెట్లో లిస్టింగ్ అయ్యాయి. ఆయిల్, టెలికం, రిటైల్ బిజినెస్లలో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా దూసుకుపోవాలని ప్లాన్ చేస్తోంది.
6. ఓపెన్ఏఐ ఆల్ట్మన్
చాట్జీపీటీని డెవలప్ చేసిన ఓపెన్ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్మన్ వివాదం గుర్తుండిపోతుంది. ఓపెన్ఏఐ బోర్డు మొదట సీఈఓ పోస్ట్ నుంచి ఆయన్ని తీసేసింది. కొన్ని రోజులకే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ఏఐ రీసెర్చ్ టీమ్ హెడ్గా నియమించారు. చివరికి ఆల్ట్మన్ ఓపెన్ఏఐ సీఈఓగా తిరిగొచ్చారు. మైక్రోసాఫ్ట్ , కొత్త బోర్డు మెంబర్ల సాయంతో ఓపెన్ఏఐ బాస్గా తిరిగి జాయిన్ అయ్యారు.
7. టాటా టెక్ ఐపీఓ ఫుల్ గిరాకీ
20 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓకి వచ్చిన మొదటి కంపెనీగా టాటా టెక్నాలజీ సర్వీసెస్ నిలిచింది. కంపెనీ ఇష్యూకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇష్యూ ప్రైస్ రూ. 500 కాగా రూ.1,200 దగ్గర మార్కెట్లో లిస్టింగ్ అయ్యింది. కంపెనీ ఐపీఓ 69.43 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది.
8. టీసీఎస్ సీఈఓ పదవికి గుడ్బై
టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ ఈ ఏడాది మార్చి 16 న తన పదవి నుంచి దిగిపోయారు. నా భవిష్యత్ గురించి ఆలోచించుకోవడానికి ఉన్న సీటు కాదిది. ఇది టీసీఎస్ భవిష్యత్ గురించి ఆలోచించడానికి ఉన్న సీటు’ అని ఆయన కామెంట్ చేశారు. ఆయన ప్లేస్లో కృతివాసన్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు ఈ ఏడాది అమెజాన్, గూగుల్, మెటా, స్నాప్, స్పాటిఫై, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసేశాయి.