ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

చెన్నూర్,వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్​ వెంకటస్వామి విశాక చారిటబుల్​ ట్రస్ట్​ ద్వారా కోటపల్లి మండలం పారుపల్లి ఎస్సీ కాలనీకి కరెంట్​ మోటారును అందజేశారు. ఎస్సీ కాలనీలో బోరుబావికి మోటారు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆ గ్రామ బీజేపీ నాయకులు వివేక్​ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. బోరుకు అమర్చిన మోటారును బీజేపీ నాయకులు ఆదివారం ప్రారంభించారు. గతంలో కూడా గ్రామంలో మంచినీటి కొరత ఉన్నదని తెలపడంతో బోరు వేయించి మోటారు అందించారని తెలిపారు. స్కూల్​ విద్యార్థుల కోసం బెంచీలు సైతం అందజేశారన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వివేక్​ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ జాయింట్​ కన్వీనర్ నగునూరు వెంకటేశ్వర్లుగౌడ్, మండల అధ్యక్షుడు పెద్దల సత్యం, నాయకులు పెద్దింటి లక్ష్మణ్, మచ్చ నరేష్, మంచాల ప్రవీణ్ , చెన్నూర్​ టౌన్​ ప్రెసిడెంట్​ సుద్దపల్లి సుశీల్​కుమార్, ఆల్గం సారయ్య, తొగరి శ్రీనివాస్, మాదసు సత్యనారాయణ పాల్గొన్నారు.

ధాన్యం కేటాయింపులో దాగుడుమూతలు 

మంచిర్యాల,వెలుగు : కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వడ్లను రైస్​మిల్లులకు కేటాయించడంలో అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నిరుడు వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ (సీఎమ్మార్​) పెండింగ్​ ఉన్న మిల్లులకు ఈ వానాకాలం ధాన్యం ఇవ్వద్దని అడిషనల్​ కలెక్టర్​ ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారు. జైపూర్​ మండలం టేకుమట్లలోని బాలాజీ ఆగ్రో ఇండస్ర్టీస్​, కుందారంలోని అన్నపూర్ణ రైస్​మిల్లు, పౌనూర్​లోని సదాశివ రైస్​మిల్లు పెద్ద మొత్తంలో సీఎమ్మార్​ పెండింగ్​ ఉన్నాయి. దీంతో ఈ మిల్లులకు వానాకాలం వడ్లను కేటాయించవద్దని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఐకేపీ, పీఏసీఎస్​, డీసీఎంఎస్​ సెంటర్ల నిర్వాహకులకు సమాచారం ఇచ్చి పై మిల్లులకు లారీలు పంపవద్దని స్పష్టం చేశారు. అయినప్పటికీ అధికారులు ఆదివారం టేకుమట్లలోని బాలాజీ రైస్​మిల్లుకు నాలుగు లారీల వడ్లను కేటాయించారు. దీనిపై మిల్లు సిబ్బందిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పారు. సివిల్​ సప్లయి ఆఫీసర్​ ప్రేమ్​కుమార్​ను ఫోన్​లో సంప్రదించగా, బాలాజీ రైస్​ మిల్లు సీఎమ్మార్​ పెండింగ్​ ఉన్నప్పటికీ డిఫాల్టర్​ కాదని, అందుకే ధాన్యం కేటాయించామన్నారు. ఆ తర్వాత సదరు మిల్లులకు వడ్లు పంపవద్దని సెంటర్ల నిర్వాహకులకు వాట్సాప్​ గ్రూపుల ద్వారా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. కాగా, బాలాజీ రైస్​ మిల్లుకు సమీపంలోని ఒక కొనుగోలు కేంద్రం నుంచే వడ్లను పంపినట్టు సమాచారం. సెంటర్​కు సన్నవడ్లు రావడంతో నిర్వాహకులు, మిల్లర్​ కుమ్మక్కై ఈ తతంగం నడిపించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సన్నవడ్లను మిల్లింగ్​ చేసి ఓపెన్​ మార్కెట్​లో అమ్ముకునే ప్లాన్​లో భాగంగానే ఇది జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో వడ్లు తరలింపు...  

బాలాజీ ​మిల్లుకు కేటాయించిన వడ్లను మిల్లింగ్​ చేసి సీఎమ్మార్​ అప్పగించకుండా బయట అమ్ముకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. జూలైలో ఈ మిల్లు నుంచి వడ్లను తరలిస్తున్న లారీని సివిల్​ సప్లయి అధికారులు పట్టుకున్నారు. పోర్టిఫైడ్​రైస్​ కోసమే వడ్లను మరో మిల్లుకు తరలిస్తున్నట్టు చెప్పడంతో వదిలేశారు.  నెలలు గడుస్తున్నా ఎఫ్​సీఐకి బియ్యం ఇవ్వకపోవడం గమనార్హం.

డిమాండ్ల సాధన కోసం సమ్మెకు రెడీ

మందమర్రి/నస్పూర్,వెలుగు: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అవసరమైతే సమ్మెకైనా వెనుకడబోమని రీజియన్​ మైనింగ్​ స్టాఫ్​సబ్ కమిటీ ఇన్​చార్జి వంగరి రాజేశ్వర్​రావు తెలిపారు. ఆదివారం మందమర్రి సీఈఆర్ క్లబ్, శ్రీరాంపూర్​ప్రగతిస్టేడియంలో సాయంత్రం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఏఐటీయూసీ జనరల్​ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య, మైనింగ్ స్టాఫ్​ఇన్​చార్జి మిర్యాల రంగయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మైనింగ్​ స్టాఫ్​ సమస్యలు, డిమాండ్లపై సాధన కోసం తీసుకోవాల్సిన భవిష్యత్​కార్యాచరణపై చర్చించారు. రీజియన్ ఇన్​చార్జి వంగరి రాజేశ్వర్​రావు, మందమర్రి, శ్రీరాంపూర్​ ఏరియాల లీడర్లు బి.వెంకటస్వామి, కారుకూరి లక్ష్మణ్, తిరుపతిగౌడ్, గోపతి సత్యనారాయణ, మారపెల్లి బాపు తదితరులు పాల్గొన్నారు.

8 నుంచి 19 వరకు పోలీసు ఈవెంట్స్​ : ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి 

ఆదిలాబాద్, వెలుగు: పోలీసు ఈవెంట్స్​​పకడ్బందీగా నిర్వహిస్తామని ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 8 నుంచి 19వ వరకు కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు ఈవెంట్స్​ ఉంటాయన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,374 మంది అభ్యర్థులు హాజరవుతారని ఎస్పీ తెలిపారు. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా 10,12 వ తేదీల్లో ఈవెంట్స్​ఉంటాయన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు డిజిటల్ మీటర్లు ఉపయోగిస్తామన్నారు. పురుషులకు 1600 మీటర్లు పరుగుకు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగుకు ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్) కార్డులను ఉపయోగించి టైమ్​ను రికార్డు చేస్తామన్నారు. ప్రతి రోజూ 600 నుంచి 1200 మంది వరకు అభ్యర్థులు హాజరవుతారన్నారు. ఉదయం 5 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయని, ఉత్తీర్ణలైన వారిని రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి ఎంపికవుతారన్నారు.

జడ్పీ చైర్​పర్సన్, ఎమ్మెల్యే చేసిందేమి లేదు

ఆసిఫాబాద్, వెలుగు: జడ్పీ చైర్​పర్సన్ ​కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి అజ్మీర ఆత్మరాంనాయక్ ఆరోపించారు.ఆదివారం కెరమెరి మండలం నెహ్రూనగర్​లో సుమారు 400 మంది బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్​ నియోజకవర్గం 70 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కనీసం రోడ్లు, వంతెనలు, డ్రైనేజీలు కూడా సరిగా లేవన్నారు. ఒక్క డబుల్ బెడ్​రూమ్​కంప్లీట్​చేయలేదన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి సెర్ల మురళి, సీనియర్ లీడర్​ సుదర్శన్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వందన, మండల అధ్యక్షుడు వెంకట్​గౌడ్ పాల్గొన్నారు.